కమ్మ వారిపై దాడి చేస్తే అప్రజాస్వామ్యం అంటున్నారు: మా కాపులను కొట్టించింది మీరు కాదా?: ముద్రగడ
కాకినాడ: కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం.. తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై నిప్పులు చెరిగారు. అమరావతి ప్రాంతంలో రైతులపై పోలీసులు అరెస్టు చేయడం పట్ల చంద్రబాబు చేస్తోన్న ప్రకటనల పట్ల ముద్రగడ ఘాటుగా స్పందించారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కాపు సామాజిక వర్గం నాయకులు గానీ, కాపు రిజర్వేషన్ల ఉద్యమం గానీ ఏ విధంగా అణచివేతకు గురైందో వివరించారు. ఈ మేరకు ఆయన చంద్రబాబు నాయుడికి ఓ బహిరంగ లేఖను రాశారు.
రాజధాని మార్చాలనుకుంటే మళ్ళీ ఎన్నికలకు వెళ్ళండి..వైసీపీ గెలిస్తే రాజకీయాలు వదిలేస్తా: చంద్రబాబు
కమ్మ మహిళలపై దాడులను అప్రజాస్వామ్యం అంటూ..
చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన కమ్మ మహిళలపై దాడి చేస్తే ఇదేనా ప్రజా స్వామ్యం అంటున్నారని, తన భార్య, కోడలు సహా కాపు ఉద్యమంలో పాల్గొన్న వందలాది మంది తమ సామాజిక వర్గానికి చెందిన వారిపై పోలీసులతో దాడి చేయించినప్పుడు ప్రజా స్వామ్యం గుర్తుకు రాలేదా మాజీ గారూ అంటూ విమర్శలు సంధించారు. తమ వారికి జరిగిన అవమానం గురించి జాతీయ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారని, కాపులకు చంద్రబాబ చేసిన అవమానాన్ని, అన్యాయాన్ని గురించి లోకానికి చెప్పుకోకుండా మీడియాను కూడా కట్టడి చేసిన విషయాన్ని విస్మరించారా? అని నిలదీశారు.
చంద్రబాబు కాళ్ల కింద పోలీసులు..
పోలీసు వ్వవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసి, వారిని తన కాళ్ళ కింద పెట్టుకున్న వ్యక్తి చంద్రబాబు అని ధ్వజమెత్తారు. లాఠీలతో కొట్టించడం, బూటు కాలితో తన్నించడం, అక్రమ కేసులు పెట్టి వేధించడం, ప్రత్యేక హోదాతో సహా ఏ సమస్యపైన అయినా నిరసనలు చేపడితే అరెస్టు చేయిస్తానని, జైలుకు పంపిస్తానని బెదిరించడం వంటి అనాగరిక చర్యలన్నీ చంద్రబాబు ప్రభుత్వంలో చోటు చేసుకున్నవేనని అన్నారు.
ఆసుపత్రి అనే జైలులో..
ఆసుపత్రి అనే జైలులో 14 రోజుల పాటు ఎటువంటి కాలకృత్యాలు తీర్చుకోకుండా, బట్టలు కూడా మార్చుకోకుండా చిన్న గదిలో బంధించి, అదే గదిలో ఆరు మంది పోలీసులతో నిత్యం కాపలా పెట్టించిన విషయాన్ని అంత త్వరగా మర్చిపోయారా? అంటూ ఆయన చంద్రబాబుకు గుర్తు చేశారు. వేల మంది పోలీసులను యుద్ధ సామాగ్రితో గ్రామాలలో కవాతు చేయించి పాకిస్తాన్ మీదకు యుద్ధానికి పంపినట్లుగా తమ గ్రామాలపై పంపించారని అన్నారు.
జోలి పట్టడం సిగ్గుగా లేదా?
ఎవరి వద్ద రూపాయి కూడా చందా కూడా తీసుకోకుండా కాపు ఉద్యమం చేస్తే కొన్ని వందల కోట్లు వైసీపీ ఇచ్చిందంటూ ఇంటిలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సలహాతో తప్పుడు ఆరోపణలు చేయించారని అన్నారు. తాను ఎన్నో సార్లు రుజువులతో బహిరంగ పర్చమని అడిగితే చంద్రబాబు తోక ముడిచే వారని ఆరోపించారు. ఇలాంటి విషయాలన్నీ మరిచిపోవడం బాధాకరమని ఎద్దేవా చేశారు ముద్రగడ. చందాలతో ఉద్యమం చేయకపోయినా, చేసినట్లు అబద్దాలు చెప్పిన నిప్పు లాంటి చంద్రబాబు ఇప్పుడు జోలి పట్టడానికి సిగ్గుగా లేదా అని మండిపడ్డారు.
జీవితం అంతా కుట్రలే..
చంద్రబాబు జీవితం అంతా అబద్దాలు చెప్పడం, వెన్నుపోటు పొడవడం, పిల్లనిచ్చిన మామ ఎన్టీ రామారావును చెప్పులతో కొట్టించడం, అవే చెప్పులు విడిచి ఆయన ఫొటోకి దండ వేయడం ఇలాంటి చర్యలు చంద్రబాబు తప్ప మరెవరూ చేయలేరని అన్నారు. ఇలాంటి పనులు చేసేవారిని ప్రజలు నమ్మరని, అలాంటి చర్యలను సహించబోరని అన్నారు అందుకే శాశ్వతంగా సెలవిచ్చారుని అన్నారు. ఆ తీర్పుని స్వాగతించి విశ్రాంతి తీసుకోండని హితవు పలికారు.