కాపు కోటాపై మరో వివాదం: జస్టిస్ మంజునాథ్ సంచలనం
విజయవాడ: బీసీ కమిషన్ సభ్యులు తనను సంప్రదించకుండా, తనకు తెలియజేయకుండా బిసి కమిషన్ రిపోర్టును ప్రభుత్వానికి సమర్పించారని బిసి కమిషన్ ఛైర్మన్ జస్టిస్ మంజునాథ చెప్పారు. బీసీ కమిషన్ రిపోర్టు ఆధారంగా కాపు రిజర్వేషన్లను ఆమోదిస్తున్నట్లు ఎపి ప్రభుత్వం ప్రకటించి శనివారం ఈ అంశంపై అసెంబ్లీలో చర్చ జరుపుతున్న నేపథ్యంలో బిసి కమిషన్ ఛైర్మన్ జస్టిస్ మంజునాథ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. బిసి కమిషన్ ఛైర్మన్ జస్టిస్ మంజునాథ తాజా వ్యాఖ్యలతో టిడిపి ప్రభుత్వాన్ని మరో వివాదం చుట్టుముట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
బిసి కమిషన్ ఛైర్మన్ జస్టిస్ మంజునాథ శనివారం విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. బిసి కమిషన్ సభ్యులు ప్రభుత్వానికి రిపోర్ట్ ఇస్తున్నట్లు తనకు తెలపలేదని జస్టిస్ మంజునాథ తెలిపారు. అయితే బిసి కమిషన్ చైర్మన్గా తన రిపోర్టును ప్రభుత్వానికి అందజేయాల్సిన బాధ్యత తనపై ఉందని, ఆ ప్రకారం తాను ప్రభుత్వానికి రిపోర్ట్ ను సమర్పించనున్నట్లు జస్టిస్ మంజునాథ వెల్లడించారు.
నివేదిక ఇచ్చేముందు సభ్యులు చైర్మన్ను సంప్రదించాల్సి ఉంటుందన్నారు. కానీ అలా జరగలేదన్నారు. తనకు సభ్యుల రిపోర్టులో ఏముందో తనకు అనవసరమని, తాను రూపొందించిన రిపోర్ట్ తన వద్ద సిద్ధంగా ఉన్నందున త్వరలోనే ప్రభుత్వానికి సమర్పిస్తానని జస్టిస్ మంజునాథ తెలిపారు. కాపులను బీసీల్లో చేర్చే విషయమై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు గానూ ఎపి ప్రభుత్వం జస్టిస్ మంజునాథ కమిషన్ ను ఏర్పాటుచేసింది.
దీంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కమిషన్ సభ్యులు పర్యటించి వివిధ వర్గాల అభిప్రాయాలను సేకరించి ఓ నివేదికను రూపొందించారు. అయితే ఈ నివేదికను ఛైర్మన్ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి అందచేయాల్సి ఉండగా సభ్యులే మంత్రిమండలి సమావేశంలో అందజేయడం గమనార్హం. బిసి కమిషన్ సభ్యులు ఇచ్చిన ఈ రిపోర్ట్ ను శనివారం కేబినెట్ ఆమోదించడం జరిగాయి. ఈ రిపోర్ట్ ఆధారంగానే కాపులకు రిజర్వేషన్లను కల్పిస్తూ వారిని బీసీ ఎఫ్ గా పరిగణిస్తూ 5శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ఏర్పాట్లు చేసింది.