కాపులకు కేంద్రం బిగ్ షాక్: 'బాబు'.. బిల్లు ఏ ప్రాతిపదికపై?, ఆమోదించవద్దన్న కేంద్రం
అమరావతి: అనుకున్నట్టే అయింది.. కాపు రిజర్వేషన్ల బిల్లుకు కేంద్రం నుంచి బ్రేక్ పడింది. బంతిని మోడీ కోర్టులోకి నెట్టేసి తనపై నిందల్ని తప్పించుకోవాలన్న చంద్రబాబు వ్యూహం ఫలించింది. రిజర్వేషన్లు యాభై శాతం మించవద్దని చెబుతూనే.. ఒకవేళ ప్రత్యేక పరిస్థితుల్లో చేయాల్సి వస్తే మాత్రం అందుకు తగ్గ కారణాలేవి? అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి చురకలంటించింది డీవోపీటీ. ఈ మేరకు కేంద్ర హోంశాఖకు కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (డీవోపీటీ) లేఖ రాసింది.
Recommended Video
అంతా వ్యూహాత్మకమే!: బాబు మాస్టర్ ప్లాన్.., దాన్ని డైవర్ట్ చేయడానికే 'కాపు రిజర్వేషన్'
లేఖలో ఏముంది?:
కాపు రిజర్వేషన్ల బిల్లుకు బ్రేక్ వేసిన డీవోపీటీ.. ఈ సందర్భంగా గతంలో సుప్రీం ధర్మాసనం ఇచ్చిన తీర్పును ప్రస్తావించింది. 'ఇందిరా సాహ్ని కేసులో 1992 నవంబరు 16వ తేదీన 9మంది సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు ప్రకారం... మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదు.
ఊహించినట్లుగానే చంద్రబాబు బంతిని మోడీ కోర్టులోకి నెట్టేశారు
దీనికి సంబంధించిన 16వ అధికరణలోని నాలుగవ క్లాజును సుప్రీంకోర్టు సమర్థించింది. నైష్పత్తిక రిజర్వేషన్ గురించి ఈ అధికరణచెప్పదు. తగినంత రిజర్వేషన్ (అడక్వేట్ రిప్రెజెంటేషన్) గురించి మాత్రమే ఇందులో ఉంది.' అని లేఖలో డీవోపీటీ పేర్కొంది.
అసాధారణ పరిస్థితుల్లో..
సుప్రీం తీర్పునే ఉటంకిస్తూ.. 'ఒకవేళ అసాధారణ పరిస్థితుల్లో రిజర్వేషన్లు కల్పించాల్సి వస్తే 16వ అధికరణలోని నిబంధనలను సడలించవచ్చునని కూడా సుప్రీం తెలిపింది. అయితే ఇందుకోసం అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి.' డీవోపీటీ పేర్కొంది.
అసలు ప్రాతిపదిక ఏమిటి?..: డీవోపీటీ
సుప్రీం ఆదేశాలకు భిన్నంగా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసలు రిజర్వేషన్లకు దారితీసిన పరిస్థితులను ఎక్కడా వివరించలేకపోయింది. దాని ప్రాతిపదిక ఏమిటి?, ఎటువంటి పరిస్థితుల్లో బిల్లు రూపొందించాల్సి వచ్చింది? వంటి వివరాలేవి అందులో లేవు. కాబట్టి దీన్ని ఆమోదించకూడదని రాష్ట్రపతికి విన్నవించండి' అని కేంద్రం హోంశాఖకు డీవోపీటీ సూచించింది.
లేఖలో పొరపాట్లు:
కేంద్రం హోంశాఖకు డీవోపీటీ రాసిన లేఖలో కొన్ని పొరపాట్లు కూడా దొర్లినట్టు తెలుస్తోంది. ఈ నెల 6వ తేదీన పంపిన 'ఆఫీస్ మోమోరాండం'లో ఆంధ్రప్రదేశ్కు బదులుగా.. తెలంగాణ అని అందులో పేర్కొన్నట్టు సమాచారం.
ఆంధ్రప్రదేశ్ అని పేర్కొనాల్సిందిపోయి 'కోటా ప్రతిపాదనలకు ప్రాతిపదిక ఏమిటో తెలంగాణ ప్రభుత్వం వివరించలేదు' అని లేఖలో ప్రస్తావించినట్టు చెబుతున్నారు. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరిగి ఉంటుందని తెలుస్తోంది.