కేబినెట్ భేటీలో కాపు రిజర్వేషన్ సహా కీలక నిర్ణయాలు, పార్థసారథి ఆగ్రహం
విజయవాడ: కాపు రిజర్వేషన్ల పైన హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తితో అధ్యయనం చేయించాలని ఏపీ మంత్రివర్గం సోమవారం నిర్ణయం తీసుకుంది. ఏపీ కేబినెట్ మధ్యాహ్నం భేటీ అయింది. మూడు గంటలకు పైగా భేటీ అయింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఏపీ అర్బన్ డెవలప్మెంట్ పైన కసరత్తు ప్రారంభించింది. ఏపీ పట్టణాభివృద్ధి సంస్థకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశ పెట్టనుంది. నగరాలను, వాటిని ఆనుకొని ఉన్న గ్రామాల పట్టణీకరణే లక్ష్యంగా ఇది ఉంటుంది.
విశాఖను మెట్రో పాలిటన్ డెవలప్మెంట్ అథారిటీగా మార్చనుంది. ఇక ఏపీలోని 927 కిలోమీటర్ల తీర ప్రాంతంలో ఐదు పోర్టులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. గుజరాత్ తరహాలో ఏపీలో మారిటైమ్ బోర్డు ఏర్పాటు చేయనున్నారు. పోర్టులో మౌలిక వనరుల అభివృద్ధి లక్ష్యం.
కాపు రిజర్వేషన్కు కమిషన్ వేయనుంది. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో అధ్యయనం చేయనున్నారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన భేటీలో... పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీవర్షాలు, వరదలు, రాజధాని నిర్మాణంలో ముందుకెళ్లడం, గృహనిర్మాణం, రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితి, నిత్యావసర వస్తువుల ధరలు, ఇసుక విధానం, ప్రభుత్వ శాఖల్లో ఈ-పరిపాలన పురోగతి తదితర అంశాలపైనా చర్చించారు.
రేపటి నుంచి టిడిపి జన చైతన్య యాత్ర
తెలుగుదేశం పార్టీ మంగళవారం నుంచి జనచైతన్య యాత్ర ప్రారంభించనుంది. పార్టీ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు గుంటూరు జిల్లా వేమూరు నుంచి యాత్రను ప్రారంభించనున్నారు.
మండిపడిన పార్థసారథి
ఏపీ కేబినెట్ నెలకు మూడుసార్లు భేటీ అవుతోందని, కాని ప్రజలకు ఉపయోగపడే ఒక్క అంశం చర్చించడం లేదని మాజీ మంత్రి, వైసిపి నేత పార్థసారథి మండిపడ్డారు. ప్రజా సమస్యల పైన కేబినెట్లో చర్చించడం లేదన్నారు. రైతు సమస్యల పైన కాకుండా భూములను లాక్కునే అంశాలపై చర్చిస్తున్నారన్నారు.
ధరలను నియంత్రించాల్సింది పోయి మరింత పెంచుతున్నారని మండిపడ్డారు. సంక్షేమ పథకాలలో, సబ్సిడీల్లో కోత విధిస్తున్నారని ఆరోపించారు. ఏపీలో తక్షణమే ఉద్యోగుల భర్తీ కోసం ప్రకటన చేయాలని పార్థసారథి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.