టి-టిడిపికి కాపు సెగ!: రిజైన్ చేస్తా.. బాబుకు ఆర్ కృష్ణయ్య షాక్, 'జగన్ దురదృష్టవంతుడు'
అమరావతి: కాపు, బలిజ, తెలగ, ఒంటరిలకు 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ శనివారం ఉభయ సభల్లో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించారు. దీనిపై కాపు నేత ముద్రగడ పద్మనాభం, వైసీపీ నేత అంబటి రాంబాబు స్పందించారు. కాపులకు ఐదుు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించడం, అసెంబ్లీలో బిల్లు చేయడం సంతోషమేనని ముద్రగడ అన్నారు.
రాష్ట్రంలో కాపులు కోటికి పైగా ఉండగా నివేదికలో 50 లక్షల మంది మాత్రమే ఉన్నారని ప్రకటించడం బాధాకరమన్నారు. దీనిపై సీఎం పునఃసమీక్ష చేయించి వాస్తవ పరిస్థితులను వెల్లడించాలన్నారు. కాపుల జనాభా నిష్పత్తి ప్రకారం 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని, ప్రస్తుతం ప్రకటించిన ఐదు శాతం రిజర్వేషన్ల బిల్లును ముందుకు నడిపిస్తూనే మరో ఐదు శాతం పెంచేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
చదవండి: కాపు రిజర్వేషన్ల బిల్లుకు అసెంబ్లీ ఆమోదం: బాబు ఏమన్నారంటే..?, ఎస్టీల్లోకి బోయ, వాల్మీకి
భోజనం పెడతానని టిఫిన్ పెట్టారు
రాష్ట్రంలో కాపులకు పూర్తి స్థాయిలో భోజనం పెడతానని చంద్రబాబు హామీ ఇచ్చారని, కానీ ప్రస్తుతం టిఫిన్ మాత్రమే పెట్టారని ముద్రగడ అన్నారు. అసెంబ్లీలో కాపుల రిజర్వేషన్ల కోసం చేసిన బిల్లును పార్లమెంట్లో 9వ షెడ్యూల్లో చేర్చేలా ఇప్పటి నుంచే చర్యలు చేపట్టాలన్నారు. 2018 మార్చి నెలాఖరు నాటికి కాపులకు రిజర్వేషన్ల ఫలాలు అందించేలా కేంద్రంతో చర్చిస్తూ బిల్లు అయ్యేట్లు చూడాలన్నారు. లేదంటే మార్చి తర్వాత ఉద్యమ పంథా కొనసాగుతుందన్నారు. ఇతర కులాల వారు ఇబ్బందిపడేలా వ్యవహరించవద్దని కాపులకు సూచించారు.
ఇలా రిజర్వేషన్లు ఇస్తే సమస్యలు
పోలవరం ప్రాజెక్టుపై వివాదం రాజుకున్న సమయంలో ఆ విషయంపై ప్రజల దృష్టిని మరల్చడానికి కాపులకు రిజర్వేషన్ల అంశాన్ని చంద్రబాబు తీసుకొచ్చారని అంబటి రాంబాబు ఆరోపించారు. శాస్త్రీయత లేని నివేదికల ఆధారంగా కాపులకు రిజర్వేషన్ల తీర్మానాలు చేస్తే భవిష్యత్తులో సమస్యలు వస్తాయని హెచ్చరించారు.
ఆ దెబ్బతో కమిషన్ వేశారు
కాపులను బీసీల్లో చేర్చే ప్రక్రియ శాస్త్రీయ పద్ధతిలో జరగలేదని అంబటి ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లోనే రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ఇన్నాళ్లు కాలయాపన చేశారన్నారు. ముద్రగడ పోరాటం చేయడంతో ఇక తప్పని సరి పరిస్థితుల్లో మంజునాథ కమిషన్ వేశారని, అసలు ఆ కమిషన్ నివేదిక రాకుండానే అసెంబ్లీలో బిల్లు పాస్ చేశారని ఆరోపించారు.
ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరిక
మరోవైపు, కాపులను బీసీల్లో చేర్చి రిజర్వేషన్లు కల్పించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై బీసీ సంఘాలు శనివారం గుంటూరు, కాకినాడ కలెక్టరేట్ల వద్ద నిరసన వ్యక్తం చేశాయి. బీసీలకు అన్యాయం జరగకుండా కాపులకు రిజర్వేషన్లు కల్పించే అంశంపై శ్వేతపత్రం విడుదల చేయాలని పలుమార్లు డిమాండ్ చేసినా ప్రభుత్వం పట్టించుకోకపోవటం దారుణమన్నారు. అభివృద్ధి చెందిన కాపులను బీసీల్లో కలిపి తమకు ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందన్నారు. ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామన్నారు.
ఆర్ కృష్ణయ్య హెచ్చరిక
కాపులను బీసీ జాబితాలో చేరుస్తూ ఏపీ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని టిడిపి ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ విషయమై రాజీనామా చేస్తారా? అని విలేకర్లు ప్రశ్నించగా.. పరిశీలిస్తానని చెప్పారు. అవసరమైతే టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆయన టిడిపి నుంచి గెలిచినప్పటికీ ఆ పార్టీకి మొదటి నుంచి దూరం పాటిస్తున్నారనే చెప్పవచ్చు.
జగన్ దురదృష్టవంతుడు
కాపుల రిజర్వేషన్పై మంత్రులు, టీడీపీ నేతలు స్పందించారు. చంద్రబాబు మాట ఇస్తే నిలబెట్టుకుంటారని, కాపు రిజర్వేషన్లే ఇందుకు ఉదాహరణ అని, బిల్లు ప్రవేశపెట్టిన సభలో లేని విపక్ష నేత జగన్ దురదృష్టవంతుడని పల్లె రఘునాథ్ రెడ్డి అన్నారు. జగన్ కులాలను రెచ్చగొడుతున్నారని, తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని, కాపులకు ఇది శుభదినమని ఎమ్మెల్యే వర్మ అన్నారు.