కాపు రిజర్వేషన్: విద్యా, ఉపాధి రంగాల్లో మాత్రమే, మంజునాథన్ కమిషన్ నివేదిక ఏం చెప్పిందంటే..
కాపులకు 5 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ఏపీ కేబినెట్ సమావేశం నిర్ణయం తీసుకోవడానికి వెనుక జస్టిస్ మంజునాథన్ కమిషన్ సమర్పించిన నివేదిక కీలకంగా మారింది.
అమరావతి: కాపులకు 5 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ఏపీ కేబినెట్ సమావేశం నిర్ణయం తీసుకోవడానికి వెనుక జస్టిస్ మంజునాథన్ కమిషన్ సమర్పించిన నివేదిక కీలకంగా మారింది. శుక్రవారం జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో కాపులు, కొన్ని ఇతర కులాలకు 5 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని తీర్మానం చేసిన సంగతి తెలిసిందే.
Recommended Video
సంచలనం: కాపులకు 5 శాతం రిజర్వేషన్, ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు...
ఇక బీసీలకు ఉద్యోగాలు రానట్టే, పెద్ద ఎత్తున ఉద్యమించాల్సిందే: ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య
దీనిపై శనివారం ఉదయం మళ్లీ ఒకసారి కేబినెట్ సమావేశం కానుంది. ఏపీ కేబినెట్ తీర్మానాన్ని కేంద్రానికి పంపించి, రిజర్వేషన్ అమలుకు తగిన చర్యలు తీసుకోనున్నారు. ఈ మొత్తం పరిణామం వెనుక జస్టిస్ మంజునాథన్ కమిషన్ ప్రభుత్వానికి అందజేసిన నివేదిక కీలక పాత్ర పోషించింది.
రిజర్వేషన్ల తీర్మానం వెనుక...
కాపు రిజర్వేషన్లపై ఈ నివేదిక చేసిన సిఫార్సులపై శుక్రవారం నాటి కేబినెట్లో కీలక చర్చ జరిగింది. కమిషన్ నివేదికలోని సిఫార్సులను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం కేబినెట్ భేటీలో దీన్ని టేబుల్ అజెండాగా ఉంచి చర్చించింది. దీనిపై ఒక తీర్మానం చేసి త్వరలో కేంద్రానికి పంపిస్తారు. రిజర్వేషన్ల అమలుకు మార్గం సుగుమం చేస్తారు. ఇది రాజకీయపరమైన రిజర్వేషన్ కాదని, విద్య, ఉపాధి రంగాలకు మాత్రమే రిజర్వేషన్ వర్తిస్తుందని కమిషన్ వర్గాలు తెలిపాయి.
మంజునాథన్ కమిషన్ను ఏర్పాటు ఇలా...
కాపులను బీసీల్లో చేర్చాలన్న డిమాండ్కు మద్దతు పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జస్టిస్ మంజునాథన్ నేతృత్వంలో బీసీ కమిషన్ను ఏర్పాటు చేసింది. ఇందులో ఛైర్మెన్తో పాటు మరో ముగ్గురు ఉన్నారు. ఈ కమిషన్ అన్ని జిల్లాల్లో పర్యటించి అధ్యయనం చేసింది. ప్రజాభిప్రాయాన్ని సేకరించింది. అందరి నుంచి విజ్ఞాపన పత్రాలు తీసుకుంది. కొన్ని గ్రామాల్లో ప్రజల వద్దకు వెళ్లి పరిస్థితిని పరిశీలించింది.
కాపుల ఆర్థిక వెనుకబాటు నిజమే...
ఒకటి రెండు జిల్లాల్లో మినహా మిగతా చోట్ల కాపులు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని జస్టిస్ మంజునాథ కమిషన్ గుర్తించింది. వారి పరిస్థితి దయనీయంగా ఉందని అర్థం చేసుకుంది. అందుకే వారిని బీసీ కులాల్లో చేర్చాలని కమిషన్లో మెజార్టీ సభ్యులు అభిప్రాయ పడ్డారు. వారి ఆలోచన ఆధారంగా ఒక నివేదికను రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారు.
నివేదికలో ఆ రెండు అంశాలే కీలకం...
కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్ డిమాండ్ సహేతుకమైనదని జస్టిస్ మంజునాథ కమిషన్ అభిప్రాయపడింది. కమిషన్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లో రెండు అంశాలు ప్రధానంగా ఉన్నాయి. విద్య, ఉపాధి రంగాల్లో రిజర్వేషన్ కల్పించడం మొదటిది. బాగా వెనుకబడిపోయిన కాపు కులస్తుల అభ్యున్నతికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని కమిషన్ సూచించింది. రిజర్వేషన్ అమలులోకి వచ్చాక కూడా గతంలో కాపుల సంక్షేమానికి తీసుకున్న చర్యలను కొనసాగించాలని కూడా కమిషన్ సలహా ఇచ్చింది.
అవన్నీ యథావిధిగా కొనసాగాలి...
పేద కాపులకు ఆర్థిక సాయం అందించే కాపు రిజర్వేషన్ యథావిథిగా కొనసాగించాలి. కాపు యువత విదేశాల్లో చదువుకునేందుకు అమలవుతున్న కాపు విద్యోన్నతి లాంటి పథకాలు ఇకపై కూడా అమలు కావాలి. అవరోధాలు లేని రిజర్వేషన్ అమలుకు తీసుకోవాల్సిన చర్యలు కూడా మంజునాథ కమిషన్ సూచించినట్లు సమాచారం.
కోట్ల విజయభాస్కర్ రెడ్డి హయాంలో...
గతంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్నప్పుడు కాపులకు రిజర్వేషన్ కల్పిస్తూ జీవో జారీ చేశారు. అయితే ఆ జీవోకు చట్టబద్ధత లేదంటూ హైకోర్టు కొట్టిపారేసింది. మళ్లీ అలా జరగకూడదన్న భావనతో సీఎం చంద్రబాబు మంజునాథ కమిషన్ ను నియమించి కమిషన్ సలహా మేరకు రిజర్వేషన్పై కేబినెట్లో తీర్మానం చేశారు.
సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే...
ఈ సందర్భంగా గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకూడా ఇక్కడ ప్రస్తావనార్హమే. కొత్తగా రిజర్వేషన్లు కల్పించాలన్న 50 శాతం రిజర్వేషన్ పరిధి దాటకూడదు. రిజర్వేషన్ యాభై శాతం దాటాల్సిన పరిస్థితి వస్తే దాని చట్టబద్ధతపై ప్రభుత్వం వద్ద సరైన ఆధారాలు ఉండాలి. ఇలాంటి సమస్యలకు బీసీ కమిషన్ పరిష్కారం సూచించి ఉంటుందని నమ్ముతున్నారు.
కాపు వర్గం నేతలు హర్షం...
మరోవైపు తమకు రాజకీయ రిజర్వేషన్ అవసరం లేదని, కాపు సామాజిక వర్గం నేతలే చెబుతున్నారు. విద్య, ఉద్యోగ రంగాల్లో వెనుకబడి పోయినందున ఆ అంశాల్లో తమకు న్యాయం జరిగితే చాలనేది వారి వాదన. ఈ నేపథ్యంలో మంజునాథ కమిషన్ నివేదికలోని సిఫార్సులపై కాపు వర్గం నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.