ఇదీ జీవో 30! ట్విస్ట్: కాపులకు ముద్రగడ అన్యాయం చేస్తున్నారా?
విజయవాడ: కాపులను బీసీల్లో చేర్చాలని మాజీ మంత్రి, కాపు నేత ముద్రగడ పద్మనాభం తలపెట్టిన బహిరంగ సభ ఆదివారం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. అయితే, జీవో 30 పైన మంత్రి నారాయణ సోమవారం కొత్త ట్విస్ట్ ఇచ్చారు. ఆ జీవో విడుదల చేస్తే కోర్టులో నిలబడదని సీఎం చంద్రబాబుకు కూడా మంత్రులు చెప్పారని తెలుస్తోంది.
జీవో 30 అమలు అయితే కాపులకు రిజర్వేషన్లు వస్తాయని ముద్రగడ కాపు కులస్తులకు హామీ ఇవ్వగలరా అని మంత్రి నారాయణ సవాల్ చేశారు. జీవో 30 అమలు చేయాలని అడగటం అంటే కాపులను అమాయకులను చేయడమే అన్నారు. టిడిపి కాపులను బీసీల్లో చేర్చేందుకు కట్టుబడి ఉందని చెప్పారు.
1993లో ముద్రగడ పద్మనాభం నిరాహార దీక్ష చేశారని, ఆ సమయంలో ముఖ్యమంత్రి కోట్ల విజయ భాస్కర్ రెడ్డి ఓ జీవో తెచ్చారని గుర్తు చేశారు. అయితే ఆ జీవోలో ఏదీ స్పష్టంగా లేదన్నారు. అలాంటప్పుడు ఆ జీవోను అమలు చేయమని చెప్పడమంటే కాపులకు అన్యాయం చేయడమే అన్నారు.
నాడు ఇచ్చిన జీవోలో కాపులకు ఎంత శాతం రిజర్వేషన్? ఏ కేటగిరీలో ఇస్తారు? అంటే బీసీ ఏ, బీసీ బి, బీసీ సి, బీసీ డీ.. ఇలా ఏ కేటగిరీలో ఇస్తారో లేదని చెప్పారు. ఆ జీవోలో స్పష్టత లేదన్నారు. అలాంటప్పుడు ఆ జీవోను అమలు చేయడమంటే కాపులకు అన్యాయం చేయడమే అన్నారు.
ఇచ్చిన జీవోను అమలు చేయమని నాడు కోర్టుకు ప్రభుత్వమే చెప్పిందన్నారు. కాపులకు సంపూర్ణ న్యాయం చేసేందుకు తొమ్మిది నెలలు ముద్రగడ పద్మనాభం ఆగలేకపోయారా అని ప్రశ్నించారు. కాపులకు జీవో 30 ద్వారా న్యాయం జరగదని, కమిటీ వేశామని నారాయణ అభిప్రాయపడ్డారు.
కాపులకు న్యాయం చేయాలని భావిస్తే.. జీవో 30 సరిగా లేదనుకుంటే ప్రభుత్వం దానిని సరి చేయవచ్చు కదా అని ముద్రగడ ప్రశ్నిస్తున్నారు. అయితే, కమిటీ వేసింది అందుకేనని, ముద్రగడ తొమ్మిది నెలలు ఆగలేరా అని టిడిపి నేతలు ప్రశ్నిస్తున్నారు. కాగా, కాపులను బీసీల్లో చేర్చే అంశంపై నాలుగైదు రోజుల్లో ఆమరణ దీక్షకు దిగుతానని ముద్రగడ హెచ్చరించిన విషయం తెలిసిందే.