'కాపు హామీపై బాబు సిద్ధం, జగన్ భూకబ్జాలపై దృష్టి'
హైదరాబాద్: ఇచ్చిన హామీ మేరకు టిడిపి ప్రభుత్వం కాపులను బిసిలలో చేరుస్తుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప అన్నారు. అయితే కాపులను బీసీలలో చేర్చడం ద్వారా ఇతరులకు నష్టం కలిగించమని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారం సమయంలో కాపులను బీసీలలో చేరుస్తానని హామీ ఇచ్చారని, దానిని నిలబెట్టుకుంటామని చెప్పారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన టిడిపి ప్రభుత్వం దృష్టి సారిస్తున్నట్టు కనిపిస్తోంది. జగన్ చేసిన భూకబ్జాలపై దృష్టి పెడతామని, బాధితులకు అండగా నిలుస్తామని చిన రాజప్ప సోమవారం విశాఖలో అన్నారు. అంతేకాకుండా మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని కూడా తెలిపారు.
విద్యావ్యవస్థలో మార్పులు: గంటా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యావ్యవస్థలో సమూలంగా మార్పులు తీసుకొచ్చేందుకు శ్రీకారం చుడతానని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు తెలిపారు. ఈ నెల 18న మంత్రిగా సచివాలయంలో విధులు స్వీకరిస్తానన్నారు. బోధనా రుసుముపై విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళనలు నెలకొన్నందున, పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే ముఖ్యమంత్రితో సమావేశమవుతానని వెల్లడించారు.
వెంకయ్య, బాబు నాటకాలు: నారాయణ
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాపై సిఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు నాటకాలాడుతున్నారని సిపిఐ నేత నారాయణ ఆరోపించారు. చిత్తూరులో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా లేదన్నారు. రుణమాఫీపై చంద్రబాబు రైతులను మోసం చేస్తున్నారని ఆయన విమర్శించారు. చుండూరు కేసుపై ప్రభుత్వమే సుప్రంకోర్టులో కేసు వేయాలన్నారు. సాక్షులు లేరంటూ కోర్టు కేసును కొట్టివేయడం సరికాదన్నారు.