కాపులతో దశాబ్దాలుగా ఆట! పలురంగాల్లో కీలక నేతలు, సినీ పరిశ్రమలోను..
విజయవాడ: కాపులను బీసీల్లో చేర్చుతానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సార్వత్రిక ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఈ హామీ నెరవేర్చాలని రెండు రోజుల క్రితం నిర్వహించిన కాపు గర్జన ఉద్రిక్తతకు దారి తీసింది. దీనిపై జోరుగా చర్చ సాగుతోంది.
తుని విధ్వంసం పైన అధికార, ప్రతిపక్షాలు పరస్పరం దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. కాపులతో పాటు తెలగ, బలిజ, ఒంటరి కులాలను బీసీలలో చేర్చాలని దశాబ్దాలుగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నాలుగు కులాలు గతంలో బీసీలలోనే ఉండేవి. 1915 నుంచి వీరు బీసీల్లోనే ఉన్నారు. 1956లో తొలగించారు.
అందుకే ఆపేశా: ముద్రగడ, రైలు దగ్ధం వెనుక 'భారీ' వ్యూహం! (పిక్చర్స్)
ఆ తర్వాత వారిని బీసీలలో చేర్చారు. అనంతరం 1966లో మళ్లీ తొలగించారు. అప్పటి నుంచి కాపులు తమను బీసీల్లో చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఉద్యమాలు చేస్తున్నారు. రిజర్వేషన్లు లేకపోవడంతో తాము వెనుకబడిపోయామని కాపులు చెబుతున్నారు.
నవ్యాంధ్ర ప్రదేశ్లో కాపులు, ఉప కులాల వారు 27 శాతం ఉన్నారు. కాపులలో చాలామంది అన్ ఆర్గనైజ్డ్ సెక్టార్లోనే ఉద్యోగాలు చేస్తున్నారు. కాపులను బీసీల్లో చేర్చాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు దీని కోసం ఓ కమిషన్ వేసారు.
ఆ కమిషన్ రిజర్వేషన్ల పైన స్టడీ చేసి తొమ్మిది నెలల్లో నివేదిక ఇవ్వనుంది. ముద్రగడ పద్మనాభం కాపు గర్జన పైన టిడిపి నేతలు ఇదే ప్రశ్నిస్తున్నారు. కాపులు టిడిపికి అండగా నిలిచారని, వారికి ఇచ్చిన హామీని నెరవేరుస్తామని, అందుకోసం ముద్రగడ తొమ్మిది నెలలు ఆగలేరా అని ప్రశ్నించారు.
కాపుల్లో ప్రభావితం చేసేవారు ఎందరో...
కాపు సామాజిక వర్గం నుంచి ఎందరో ఐఏఎస్, ఐపీఎస్లు కావడమే కాదు... పలు రంగాల్లో పెద్ద ఎత్తున ప్రభావితం చేసేవారు ఉన్నారు. సినిమా పరిశ్రమ విషయానికి వస్తే టాప్ హీరోలు చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, ఎస్వీ రంగారావు, దర్శకులు పూరీ జగన్నాథ్, వీవీ వినాయక్, కోడి రామకృష్ణ, దర్శకరత్న దాసరి నారాయణ రావు, నటుడు కైకాల సత్యనారాయణ, సావత్రి తదితరులు ఉన్నారు.
సినిమా పరిశ్రమలో కాపుల తర్వాత... దాదాపు 55 మంది కాపు నటులు, దర్శకులు టాలీవుడ్ పరిశ్రమలో ఉన్నారు. పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, కేంద్రమంత్రులుగా కూడా పని చేశారు. మాజీ కేంద్రమంత్రి పళ్లం రాజు కాపు సామాజిక వర్గానికి చెందిన వారు.
ప్రస్తుత చంద్రబాబు కేబినెట్లో మంత్రులు నారాయణ, గంటా శ్రీనివాస రావులతో పాటు ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప ఉన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ జ్యోతుల నెహ్రూ కూడా అదే సామాజిక వర్గానికి చెందినవారు. ఇలా ఎందరో ఇన్ఫ్లుయెన్స్ కలిగిన నేతలు ఉన్నారు.