గొట్టిపాటితో చిచ్చు: చంద్రబాబును టార్గెట్ చేసిన కరణం
వేమవరం ఘటనపై కరణం బలరాం చంద్రబాబును టార్గెట్ చేశారు. దీంతో చంద్రబాబు తీవ్రమైన చిక్కుల్లో పడినట్లేనని భావిస్తున్నారు.
ఒంగోలు: ప్రకాశం జిల్లా చిచ్చు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి చిక్కులు తెచ్చిపెడుతోంది. ఎమ్మెల్సీ కరణం బలరాం నేరుగా చంద్రబాబుకే సవాల్ విసిరారు. ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం వేమవరంలో జరిగిన ఘర్షణ టిడిపిలోని అంతర్గత పోరును బహిర్గతం చేస్తోంది.
వేమవరంలో వివాహ వేడుకకు హాజరై తిరిగి వస్తున్నవారిపై ప్రత్యర్థులు దాడిచేసి, ఇద్దరిని హత్య చేసిన విషయం తెలిసిందే. మృతులు గోరంట్ల ్ంజయ్య, యోగినాటి రామకోటేశ్వర రావు కరణం బలరాం వర్గానికి చెందినవారు. గొట్టిపాటి రవికుమార్ వర్గానికి చెందినవారే ఈ దాడికి పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి.
గొట్టిపాటి రవికుమార్ దొంగ సొమ్ము గురించి చంద్రబాబే చెప్పాలని కరణం బలరాం అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి గొట్టిపాటి రవికుమార్ డబ్బు సంపాదన కోసమే టిడిపిలోకి వచ్చారని ఆయన ఆరోపించారు.
దేనికి సంకేతం...
తన ఇద్దరు అనుచరుల హత్యపై కరణం బలరాం తీవ్రంగా స్పందించారు. ఈ హత్యాకాండపై చంద్రబాబు నాయుడు స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. హత్యలు జరిగిన సంఘటనపై ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి మీడియాతో మాట్లాడారు. గొట్టిపాటి రవికుమార్పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. చంద్రబాబుపై తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం ద్వారా కరణం బలరాం ఏ విధమైన సంకేతాలు ఇస్తున్నారనే చర్చ సాగుతోంది. కేవలం ఆగ్రహంతోనే చంద్రబాబుపై వ్యాఖ్యలు చేశారా, భవిష్యత్తు రాజకీయం పట్ల వేరే ఆలోచన ఏదైనా ఉందా అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.
ఆస్పత్రిలో మృతదేహాలు...
వేమవరం దాడిలో చనిపోయిన వారి మృతదేహాలు చిలకలూరిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో ఉంచారు. అక్కడికి కరణం బలరాం అనుచరులు పెద్ద యెత్తున చేరుకున్నారు. బంధువుల రోధనలతో ఆ ప్రాంతంలో విషాద వాతావరణం చోటు చేసుకుంది. ఈ హత్యలకు గొట్టిపాటి రవే కారణమని ఆరోపిస్తున్న బాధితులు నిందుతులను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
పరిస్థితి ఉద్రిక్తం..
కార్యకర్తల మృత దేహాలతో కరణం బలరాం అనుచరులు రోడ్డుపై బైఠాయించే అవకాశాలు ఉందనే అనుమానంతో పరిస్థితి ఉద్రిక్తతగా మారకుండా పోలీసులు పెద్ద ఎత్తున ఆస్పత్రి వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వేమవరంలో పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. పోలీసులు 144వ సెక్షన్ విధించారు. గొట్టిపాటి రవికుమార్పై వారు తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు.
చంద్రబాబు ఏం చేస్తారు...
వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చెందినవారిని తమ పార్టీలోకి చంద్రబాబు ఆహ్వానిస్తూ స్థానికంగా ఉన్న గ్రూపుల మధ్య సమన్వయం కుదిర్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇరు వర్గాలకు చెందిన నాయకులకు నచ్చజెప్పే ప్రయత్నాలు సాగిస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన గొట్టిపాటి రవికుమార్ను పార్టీలో చేర్చుకున్నారు. ఇది కరణం బలరాంకు నచ్చడం లేదు. అందుకే వైసిపి నుంచి వచ్చినవారిని తమపై చంద్రబాబు రుద్దుతున్నారనే తీవ్రమైన వ్యాఖ్య చేశారు. ఇప్పుడు చంద్రబాబు ఏ విధంగా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.