మా జిల్లాను పక్కన బెట్టారా:కరణం బలరాం,రేసులో ఉన్నా:వరదరాజులరెడ్డి
అమరావతి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ కరణం బలరాం శాసన మండలిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రకాశం జిల్లాను ప్రభుత్వం ఎందుకు అభివృద్ధి చేయడం లేదని ఆయన ప్రశ్నించారు.
జిల్లాలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న పెట్టుబడిదారులను ఎందుకు వెనక్కు పంపుతున్నారని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆంధ్రప్రదేశ్ పటంలో ప్రకాశం జిల్లాను పక్కనబెట్టారని కరణం బలరాం ఆవేదన వ్యక్తం చేశారు. అయితే టిడిపి ప్రభుత్వంపై అధికారపార్టీ ఎమ్మెల్సీనే అది కూడా శాసనమండలిని వేదికగా చేసుకొని ఆగ్రహం వ్యక్తం చేయడంతో కలకలం రేగింది. మరోవైపు ప్రొద్దుటూరు టీడీపీ ఎమ్మెల్యే టిక్కెట్ రేసులో తానున్నానని మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ప్రకటించారు.
ఇదిలా వుండగా ప్రొద్దుటూరు టీడీపీ ఎమ్మెల్యే టిక్కెట్ రేసులో తానున్నానని...అధిష్ఠానం ఆదేశిస్తే పోటీకి సిద్ధమని ప్రొద్దుటూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి నంద్యాల వరదరాజులరెడ్డి ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో పార్టీ అధిష్ఠానం తనకు కానీ, తన కుటుంబ సభ్యులకు కానీ పార్టీ టిక్కెట్ ఇస్తే పోటీకి సిద్ధమన్నారు. రాజకీయ ప్రత్యర్థులు కొందరు 2019 ఎన్నికల్లో తనకు టిక్కెట్ రాదని, పోటీలో ఉండనని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఎన్నికల సమయం లో పార్టీ ఎవరికి టిక్కెట్ ఇస్తే వారే పోటీలో ఉంటారన్నారు. గెలుపు మాత్రం టీడీపీదేనని స్పష్టం చేశారు.
ఢిల్లీలో ప్రధానమంత్రి మోడీ కార్యాలయాన్ని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడ్డాగా చేసుకున్నారని వరదరాజుల రెడ్డి ఆరోపించారు. పలు కేసుల్లో నిందితునిగా ఉంటూ విచారణ ఎదుర్కొంటున్న విజయసాయిరెడ్డికి మచ్చలేని ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శించే అర్హత లేదన్నారు.
ఒక ప్రక్క బీజేపీ, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సాయం చేయకున్నా వారికి వైసీపీ అండగా ఉందన్నారు. ప్రధానమంత్రి మోడీపై విజయసాయిరెడ్డి మాట పడనీయడంలేదని, ఎపి ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని చెప్పారు. అవిశ్వాసాన్ని ఎదుర్కొనే ధైర్యం కేంద్రానికి లేదని వరదరాజులరెడ్డి ఎద్దేవా చేశారు.