గొట్టిపాటి వల్లే అల్లర్లు, దమ్ముంటే ఫేస్ టు ఫేస్ తేల్చుకుందాం: కరణం సవాల్
అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ వల్లే నియోజకవర్గంలో అల్లర్లు చెలరేగుతున్నాయని టీడీపీ నేత కరణం వెంకటేష్ తీవ్రంగా స్పందించారు. ఘర్షణలతో గొట్టిపాటి రవికుమార్ రెచ్చగొడుతున్నారని అన్నారు.
ప్రకాశం: అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ వల్లే నియోజకవర్గంలో అల్లర్లు చెలరేగుతున్నాయని టీడీపీ నేత కరణం వెంకటేష్ తీవ్రంగా స్పందించారు. ఘర్షణలతో గొట్టిపాటి రవికుమార్ రెచ్చగొడుతున్నారని అన్నారు. దమ్మూ ధైర్యం ఉంటే ఫేస్ టు ఫేస్ తేల్చుకోవాలని వెంకటేష్ తేల్చి చెప్పారు.
"ఎమ్మెల్యే రవి ఓ నపుసంకుడు, ఆ దొంగ సొమ్ముకు చంద్రబాబు సమాధానమేంటి?"
ప్రాణాలు తీయడం సరికాదు
కరణం వెంకటేష్ వేమవరం ఘటనపై శనివారం మాట్లాడుతూ.. ఇలా ప్రాణాలు తీయడం సరికాదని అన్నారు. అడవిలో జంతువుల్లా టీడీపీ కార్యకర్తలను వేటాడి చంపారని తెలిపారు. తెలుగుదేశం పార్టీని నమ్ముకుని వేలాది మంది ఉన్నారని, వారే తమను గెలిపిస్తున్నారని చెప్పారు.
గొట్టిపాటి మోసం చేశారు..
అలాంటి వారే ఇప్పుడు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. చనిపోయిన వారు గత 30ఏళ్లుగా తెలుగుదేశం పార్టీకి సేవ చేస్తున్నారని అన్నారు. గొట్టిపాటి రవి అందర్నీ కలుపుకుని పోవాలని అన్నారు. గొట్టిపాటి రవి టీడీపీలోకి వచ్చి 95వేలమంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను మోసం చేశారంటూ మండిపడ్డారు.
అధికారం కోసమే..
ఎమ్మెల్సీ కరణం కూడా గొట్టి రవికుమార్పై తీవ్రస్థాయిలోనే మండిపడ్డారు. అధికారం అనుభవించాలనే కోరికతోనే గొట్టిపాటి టీడీపీలో చేరారని అన్నారు. ఇప్పుడు ఇలా పార్టీ కార్యకర్తలను చంపి భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నాడని మండిపడ్డారు. దీనిపై టీడీపీ అధిష్టానం ఆలోచించాలని సూచించారు.
కరణం వర్గీయుల దారుణ హత్య
కాగా, వేమవరంలో శుక్రవారం రాత్రి కొందరు వ్యక్తులు ఇద్దరు టీడీపీ నేతలు రామకోటేశ్వరరావు, అంజయ్య(కరణం వర్గీయులు)లను అత్యంత దారుణంగా కత్తులు, కర్రలతో దాడి చేసి చంపిన విషయం తెలిసిందే. ఈ దాడిలో మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.