అందుకే పార్టీలో చేరా........ కారెం శివాజీ
ఎస్సీ, ఎస్టీ కమీషన్ చైర్మన్గా రాజీనామా చేసిన కారెం శివాజీ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి జగన్ పక్షంలో పార్టీలో చేరారు. ఆయనకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మూడున్నర సంవత్సరాల పాటు ఎస్సీ, ఎస్టీ కమీషన్ చైర్మన్గా సేవలు అందించారు. ఈనేపథ్యంలోనే ఆయన సీఎ జగన్ చేపడుతున్న పలు సంక్షేమ పథకాలను ప్రశంసించారు.
శివాజీని పార్టీలోకి అహ్వానించిన సీఎం
గతంలో మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేసిన కారెం శివాజీ అనంతరం టీడీపీకి అనుబంధంగా వ్యవహరించారు. దీంతో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు శివాజీకి కీలక భాద్యతలు అప్పగించారు. ఎస్సీ, ఎస్టీ కమీషన్ చైర్మన్ గా నియమించారు. దీంతో సుమారు మూడున్నర సంవత్సరాల పాటు పదవిలో కొనసాగిన శివాజీ గురువారం రాజీనామా చేశారు. ఏపీ జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలోనే శివాజీకి సీఎం జగన్ పార్టీ ఎంట్రీకి అవకాశం ఇచ్చారు. దీంతో ఆయన వైసీపీలో తీర్థం పుచ్చుకున్నారు.
సీఎం పథకాల వల్లే పార్టీలో చేరాను
పార్టీలో చేరిన సంధర్భంగా మాట్లాడిన శివాజీ టీడీపీలో సరైన గుర్తింపు లేకనే తాను రాజీనామా చేసినట్టు తెలిపారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు , పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్టు ఆయన చెప్పారు. జగన్ చేపట్టిన పథకాలకు ఆకర్షితుడై పదవీ కాలం ఉన్నా... పార్టీలో బేషరతుగా వైఎస్ఆర్సీపీలో చేరుతున్నాను చెప్పారు. సీఎం జగన్ ఎస్సీ, ఎస్టీల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను ఆయన ప్రశంసించారు.
మాకు ఇంగ్లీష్ మీడియం అవసరం
ఇటివల సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ఇంగ్లీష్ విద్యను ఆయన స్వాగతించారు. దీనివల్ల ఎస్సీ ఎస్టీల పిల్లలు అభివృద్దిలోకి వస్తారని చెప్పారు. ఇంగ్లీష్ మాద్యమం వల్ల బడుగు వర్గాల వారికి ఉన్నత స్థాయిలో స్థిరపడే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలోనే తమ వర్గాలకు ఇంగ్లీష్ మీడియం అవసరమని అన్నారు. సాంప్రదాయ చదువులతో ఆర్ధికంగా వెనకపడే అవకాశాలు ఉన్నాయని అన్నారు. కాగా సీఎం జగన్ నిర్ణయాల వల్ల ఆరునెలల్లోనే 6 లక్షల ఉద్యోగాలు కల్పించారని చెప్పారు. దీంతో బలహీన వర్గాల్లో అనందం వ్యక్తం అవుతోందని అన్నారు. ఈనేపథ్యంలోనే తమ వర్గమంతా సీఎం వెంట ఉంటామని చెప్పారు.