Karnam Malleswari : ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీ తొలి వీసీగా కరణం మల్లీశ్వరి...
ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రముఖ వెయిట్ లిఫ్టర్,పద్మశ్రీ కరణం మల్లీశ్వరి(46) ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్(వీసీ)గా నియమితులయ్యారు. ఈమేరకు ఢిల్లీ ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ స్పోర్ట్స్ యూనివర్సిటీకి మొట్టమొదటి వీసీ కరణం మల్లీశ్వరే కావడం విశేషం. ఈ విషయాన్ని ఢిల్లీ ప్రభుత్వం తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఏపీలోని శ్రీకాకుళానికి చెందిన కరణం మల్లీశ్వరి 2000 సంవత్సరంలో సిడ్నీ ఒలింపిక్స్లో భారత్కు కాంస్య పతకం సాధించారు. భారత్ తరుపున ఒలింపిక్స్లో మెడల్ సాధించిన మొట్టమొదటి మహిళ కరణం మల్లీశ్వరే. 1994,1995లలో 54 కేజీల విభాగంలో రెండుసార్లు వరల్డ్ టైటిల్ సాధించి ఛాంపియన్గా నిలిచారు. 1994లో ఇస్తాంబుల్లో జరిగిన వరల్డ్ ఛాంపియన్షిప్లో సిల్వర్ మెడల్ సాధించారు. 1995లో కొరియాలో ఆసియన్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ సాధించారు.
ఒలింపిక్స్లో కాంస్య పథకం సాధించడం కంటే ముందే 29 ఇంటర్నేషనల్ మెడల్స్తో పాటు రెండుసార్లు వెయిట్ లిఫ్టింగ్లో మల్లీశ్వరి ఛాంపియన్గా నిలిచారు. 1999లో మల్లీశ్వరికి రాజీవ్ గాంధీ ఖేల్ రత్న,1994లో అర్జున అవార్డు,1999లో పద్మశ్రీ అవార్డులు వరించాయి.
Recommended Video
శ్రీకాకుళంలోని ఆమదాలవలసకు సమీపంలో ఉన్న వూసవానిపేటలో మల్లీశ్వరి జన్మించారు. ఆమెకు నలుగురు అక్కాచెల్లెళ్లు. అందరూ వెయిట్ లిఫ్టింగ్లో శిక్షణ పొందినవారే. 12 ఏళ్ల వయసులో మల్లీశ్వరి వెయిట్ లిఫ్టింగ్లో తన కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత ఢిల్లీకి వెళ్లి అక్కడ శిక్షణ పొందారు. 1997లో వెయిట్ లిఫ్టర్ రాజేశ్ త్యాగిని ఆమె వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు ఉన్నారు.