ఆపరేషన్ ఆకర్ష్: జగన్కు గాలి భరోసా, చంద్రబాబుకు కౌంటర్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా షాక్ ఇస్తున్న నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి సాయం చేయడానికి కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి ముందుకు వచ్చినట్లు సమాచారం.
తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించవద్దని, అలా ఫిరాయించని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులను తాను అన్ని విధాలుగా ఆదుకుంటానని గాలి జనార్దన్ రెడ్డి హామీ ఇస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. గాలి జనార్దన్ రెడ్డితో పాటు ఆయన అనుంగు అనుచరుడు, కర్ణాటక శాసనసభ్యుడు బి. శ్రీరాములు రాయలసీమకు చెందిన వైసిపి శాసనసభ్యులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నట్లు చెబుతున్నారు.
గాలి జనార్దన్ రెడ్డి ప్రయత్నాలు ఫలితాలు ఇస్తున్నట్లు కూడా చెబుతున్నారు. గాలి జనార్దన్ రెడ్డి హామీతో కర్నూలుకు చెందిన కొద్ది ఎమ్మెల్యేలు టిడిపిలో చేరడానికి సిద్ధపడి వెనక్కి తగ్గినట్లు చెబుతున్నారు. వైసిపి ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి తీసుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలను గాలి జనార్దన్ రెడ్డి అడ్డుకుంటున్నట్లు తెలుగుదేశం పార్టీ నాయకులే చెబుతున్నారు.
రాయలసీమ నుంచి వైసిపి ఎమ్మెల్యేలు 25 మంది ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 67 మంది శానససభ్యుల్లో ఇప్పటికే పది మంది అధికార తెలుగుదేశం పార్టీలో చేరారు. వైసిపిలోని ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకోవడానికి టిడిపి ఎక్కువగా ప్రయత్నాలు సాగిస్తోంది. 'నా వల్లనే మీరు గెలిచారు. ఉన్నత విద్యలు అభ్యసించడానికి మీ కుటుంబాలకు నేను సాయం చేశాను. దాన్ని దృష్టిలో పెట్టుకుని పార్టీ మారవద్దు. టిడిపిలో ప్రలోభాలకు లొంగవద్దు' అని జగన్ పార్టీ ఎమ్మెల్యేలకు చెబుతున్నట్లు సమాచారం.
జూన్లో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో నాలిగింటి నాలుగు రాజ్యసభ సీట్లను గెలుచుకోవాలనే వ్యూహరచనలో టిడిపి ఉంది. ఇందులో భాగంగానే టిడిపి వైసిపి ఎమ్మెల్యేలకు గాలం వేస్తోంది. మరో 15, 20 మంది వైసిపి ఎమ్మెల్యేలు టిడిపిలో చేరితే, వైసిపికి ఒక్క రాజ్యసభ సీటు కూడా దక్కదు.
వైసిపి ఎమ్మెల్యేలను పార్టీలోకి తేవడానికి అన్ని రకాల ప్రయత్నాలు సాగించాలని, కనీసం 20 మందిని పార్టీలోకి తేవాలని తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులను ఆదేశించినట్లు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో మే చివరినాటికి తమ లక్ష్యాన్ని సాధించే పనిలోనే మంత్రులు నిమగ్నం కానున్నట్లు తెలుస్తోంది. వైసిపి ఎమ్మెల్యేలను పార్టీలోకి తెచ్చే ఏకైక లక్ష్యంతో మంత్రులు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, వైసిపి ఎమ్మెల్యేలు పార్టీ మారడానికి షరతులు పెడుతున్నట్లు సమాచారం.
కొంత మంది తమకు వచ్చే ఎన్నికల్లో తిరిగి సీటు ఇవ్వాలని అడుగుతున్నట్లు సమాచారం. అదే సమయంలో మరికొంత మంది తమకు ఇంకా కొంత సమయం కావాలని చెబుతున్నట్లు తెలుస్తోంది.