కబ్జాదారు: బాబుపై కర్నెసంచలనం, రేవంత్ని ఏకేశారు
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన తెరాస నేత కర్నె ప్రభాకర్ ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. హైటెక్ సిటీ ఎదుట చంద్రబాబు పది ఎకరాల భూమిని అక్రమంగా సంపాదించారని ఆరోపించారు. ఆ గుట్టును త్వరలో బయటపెడతామన్నారు. బాధితులను ముందుకు తీసుకు వస్తామన్నారు. తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి చంద్రబాబు ఏజెంటుగా మాట్లాడుతున్నారని విమర్శించారు.
రేవంత్ రెడ్డి చిన్న పిల్లాడిలా, అవివేకంగా, ఆంధ్రా బానిసలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. రేవంత్ అనవసరంగా కేసీఆర్ పైన మాట్లాడుతున్నాడన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థుల పైకి తుపాకి గురిపెట్టిన రేవంత్.. ఇప్పుడు మాత్రం ప్రేమ ఉన్నట్లుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. హైటెక్ సిటీ వద్ద చంద్రబాబు అక్రమంగా సంపాదించిన పది ఎకరాల భూమిని ఆధారాలతో సహా బయటపెడతామన్నారు.
ఫీజు రీయింబర్స్మెంట్స్ విషయంలో కాలేజీ యాజమాన్యాల వైపే టీడీపీ ఉందన్నారు. ఈ పథకం కంటే ముందు 300 కళాశాలలు ఉంటే, ఆ తర్వాత 600 కళాశాలలు అయ్యాయన్నారు. వసతులు లేని కళాశాలల పైన ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఆక్రమణలకు, అక్రమాలకు పాల్పడ్డ వారికి శిక్ష తప్పదన్నారు. ఇన్నేళ్ల సమైక్య పాలనలో అన్ని కుంభకోణాలే అన్నారు.
టీడీపీ నేతలు సిగ్గులేకుండా, ఫీజు రీయింబర్సుమెంట్స్ పైన అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు. కొందరు కావాలనే ప్రభుత్వం పైన విమర్శలు గుప్పిస్తున్నారన్నారు. గత ప్రభుత్వాల అవినీతిని నిర్మూలించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అవినీతిని బయటపెట్టడాన్ని కొందరు తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. స్థానికత పైన తాము విధివిధానాలు రూపొందిస్తున్నామన్నారు. స్థానికతను తేల్చాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే అన్నారు.
స్థానికత పైన టీటీడీపీ మాట్లాడటం విడ్డూరమన్నారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐటీడీఏ ఉద్యోగాల కోసం 1950 ముందును ప్రామాణికంగా తీసుకున్నారన్నారు. అక్రమాలకు తావులేకుండా ఫాస్ట్ పథకం అన్నారు. అక్రమాలకు పాల్పడిన వారు, అక్రమాలకు సహకరించిన వారు జైలుకు వెళ్లక తప్పదన్నారు. అక్రమాల పైన సీబీసీఐడీ విచారణకు ఆదేశించామన్నారు. రేవంత్, ఆయన గురువు చంద్రబాబులు కేసీఆర్ పైన చేసిన ఆరోపణలు నిరూపించలేకపోయారన్నారు.