‘జగన్కు కేసీఆర్ ఫోన్ చేస్తే అంత తత్తరపాటేందుకు చంద్రబాబూ-మనిషివేనా?’
హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై టీఆర్ఎస్ అధికార ప్రతినిధులు కర్నె ప్రభాకర్, గట్టు రామచంద్రరావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖలో దాడి జరిగితే తెలంగాణ ప్రభుత్వాన్ని, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను నిందించడమేంటని ప్రశ్నించారు.
బాబులో అసహనం పెరిగిపోతోంది.. మతిస్థిమితం కూడా..
శుక్రవారం తెలంగాణ భవన్లో కర్నె ప్రభాకర్, గట్టు రామచంద్రరావు మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబులో అసహనం పెరిగిపోతుందని, మతి స్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని విమర్శించారు. బాబు ప్రతిదీ రాజకీయ కోణంలో మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.
జగన్తో కేసీఆర్ మాట్లాడితే ఆ తత్తరపాటేందుకు బాబూ..
చంద్రబాబు మనిషో, మరమనిషో అర్ధం కావడం లేదని ఎద్దేవా వారు చేశారు. విశాఖపట్నంలో వైయస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి జరిగితే కేసీఆర్, కేటీఆర్లు సాటి మనుషులుగా స్పందించారని అన్నారు. వైయస్ జగన్తో కేసీఆర్ మాట్లాడితే ఎందుకు అంత తత్తరపాటు అని కర్రె ప్రభాకర్, రామచంద్రరావు ప్రశ్నించారు.
బాబూ.. మానవ సంబంధాలు అనేవీ ఉంటాయి..
అలిపిరిలో చంద్రబాబు మీద దాడి జరిగినపుడు తెలంగాణా బద్ధ విరోధి అయినా దాన్ని తాము ఖండించామని వారు పేర్కొన్నారు. దాడిని ఖండిస్తే కేసీఆర్కు, మోడీతో సంబంధం అంటగడుతున్నారని ధ్వజమెత్తారు. రాజకీయాల్లో విభేదాలు ఉండవచ్చు కానీ మానవ సంబంధాలు అనేవి ఉంటాయని చెప్పారు. హరికృష్ణ మరణంపై, హుధుద్ తుఫానుపై కూడా మానవీయంగానే స్పందించామని గుర్తు చేశారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి పిలిస్తే కేసీఆర్ హాజరయ్యారని తెలిపారు.
ఆపరేషన్ గరుడ ఏమో గానీ.. ఓటుకు నోటు అయితే చేశావు..
ఆపరేషన్ గరుడ నిజంగా ఉందో లేదో తెలియదు కానీ చంద్రబాబు నాయుడు తెలంగాణ ప్రభుత్వాన్ని ఓటుకు నోటు కేసుతో అస్థిరత్వానికి గురిచేయాలని చూసింది మాత్రం నిజమని పేర్కొన్నారు. కేసీఆర్కు మానవ సంబంధాలు కూడా ముఖ్యమని చంద్రబాబు గ్రహించాలని హితవు పలికారు. చంద్రబాబువి అన్నీ ఆర్ధిక సంబంధాలేనని, ఇకనైనా బాబు చిల్లర రాజకీయాలు మానుకుంటే మంచిదని వారు హితవు పలికారు.
బాబుకు రేవంత్ కోవర్టు.. జాగ్రత్తగా ఉండాలి..
కొడంగల్ మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి.. చంద్రబాబు నాయుడు కోవర్టు అని చెప్పామని, ఇప్పుడు అదే నిజమైందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ సీనియర్లు కూడా చంద్రబాబుతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రేపు మహాకూటమి గనుక పొరపాటున అధికారంలోకి వస్తే చంద్రబాబుదే అజమాయిషీ ఉంటుందని చెప్పారు.