రేవంత్కు లగడపాటి గతి: కర్నె, బాబుకు శైలజ సవాల్
హైదరాబాద్: తెలంగాణలో విద్యుత్తు కష్టాలకు కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలే కారణమని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విమర్శించారు. యాత్రల పేరిట కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల నేతలు రైతులను రెచ్చగొడుతున్నారని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి తెలంగాణ టిడిపి నేతలు బానిసలుగా వ్యవహరిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. టిడిపి తెలంగాణ నేత రేవంత్ రెడ్డి తన వైఖరి మార్చుకోవాలని ఆయన హితవు పలికారు. లేకుంటే భవిష్యత్తులో మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్కు పట్టిన గతే రేవంత్ రెడ్డికి పడుతుందని ఆయన హెచ్చరించారు.
ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై మాజీ మంత్రి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ సీనియర్ నాయకుడు శైలజానాథ్ విరుచుకుపడ్డారు. హంద్రీనీవా ప్రాజెక్టు విషయంలో కాంగ్రెసు నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్న చంద్రబాబు వ్యాఖ్యలను ఆయన ఖండించారు. దీనిపై బహిరంగ చర్చకు రావాలని ఆయన చంద్రబాబును సవాల్ చేశారు.
చంద్రబాబు గత తొమ్మిదేళ్ల పాలనలో కేవలం ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసి చేతులు దులుపుకున్నారని ఆయన ఆరోపించారు. వాటిని కాంగ్రెసు పూర్తి చేసిందని చెప్పుకున్నారు. ఓ పక్క రైతులు సాగునీటి కోసం ఇబ్బంది పడుతుంటే చంద్రబాబు మాత్రం టూరిజం అంటూ సమావేశాలు పెట్టుకోవడం శోచనీయమని ఆయన అన్నారు. చంద్రబాబు నోట సింగపూర్, మలేషియా తప్ప మరో మాట రావడం లేదని ఆయన అన్నారు.