బీజేపీకి షాక్: మోడీ తిరుపతి హామీకి సాక్షి కారుమంచి రాజీనామా, రేపు టీడీపీలోకి
తిరుపతి: చిత్తూరు జిల్లాలో బీజేపీకి షాక్ తగిలిగింది. ఇప్పటికే ప్రత్యేక హోదా కారణంగా బీజేపీ ఇరుకున పడింది. దానికి తోడు వరుసగా నేతలు రాజీనామా చేస్తున్నారు. కన్నా లక్ష్మీనారాయణ, కాటసాని రాంభూపాల్ రెడ్డి తదితరులు వరుసలో ఉన్నారు.
కూతురుతో విమర్శలా.. ఫిర్యాదు: అఖిలకు బాబు క్లాస్! ఏవీ అసంతృప్తి వెనుక ఇదీ విషయం!!
ఇదే సమయంలో చిత్తూరు జిల్లాలో బీజేపీ నేత కారుమంచి జయరామ్ బీజేపీకి గుడ్ బై చెప్పారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తరఫున తిరుపతి లోకసభ స్థానానికి పోటీ చేసిన కారుమంచి జయరామ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు.
బీజేపీకి రాజీనామా, టీడీపీలో చేరిక
శనివారం సాయంత్రం కారుమంచి తన రాజీనామా పత్రాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షాకు ఫ్యాక్స్ చేశారు. ఈ నెల 30వ తేదీన తిరుపతిలో జరిగే ధర్మపోరాట దీక్ష బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు.
అందరి సలహాలు స్వీకరించి రాజీనామా
పోలీస్ అధికారి అయిన కారుమంచి గత సాధారాణ ఎన్నికల సందర్భంగా ఉద్యోగానికి రాజీనామా చేసి తిరుపతి నుంచి ఎంపీగా బరిలోకి దిగారు. గత కొన్నాళ్లుగా బీజేపీ అధిష్ఠానంపై కినుకతో ఉన్నారు. ఇటీవల తన నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో పర్యటించి పార్టీ మార్పుపై కార్యకర్తలు, సన్నిహితుల అభిప్రాయాలు సేకరించారు. అనంతరం రాజీనామా చేశారు.
వారం రోజుల పాటు తిరిగి అభిప్రాయ సేకరణ
ఆయన వారం రోజులుగా తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని గూడురు, వెంకటగిరి, సర్వేపల్లి, సూళ్లూరుపేట, తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించారు. అందరి అభిప్రాయాలు సేకరించారు.
మోడీ మాటలకు నేనే సాక్షి
బీజేపీ కేంద్ర, రాష్ట్ర నాయకత్వాలు మూడు గ్రూపులు, ఆరు ముఠాలుగా కొనసాగుతున్నాయని కారుమంచి ఆరోపించారు. నరేంద్ర మోడీ తిరుపతి ప్రకటనకు తానే ప్రత్యక్ష సాక్షిని అని, ఢిల్లీని తలదన్నే రాజధానిని నిర్మిస్తామని తిరునామంపై వేలెత్తి చూపిస్తూ చెప్పారని, దీనికి తానే ప్రత్యక్ష సాక్షిని అన్నారు. చంద్రబాబు నిరంతరం రాష్ట్రాభివృద్ధి కోసం శ్రమిస్తున్నారని, టీడీపీలో చేరడాన్ని గర్వంగా భావిస్తున్నానని తెలిపారు.