కరుణానిధి పూర్వీకులు తెలుగువారే! మాది ఒంగోలేనంటూ కళైంజ్ఞర్ చెప్పిన వేళ
చెన్నై/అమరావతి: దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మంగళవారం సాయంత్రం 6.10గంటలకు కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన తమిళనాడుకు ఐదుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన.. రాజకీయాల్లో 50ఏళ్లకుపైగా తనదైన ముద్ర వేశారు. తమిళనాడు రాజకీయాల్లో తిరుగులేని నేతగా ఎదిగారు. అందుకే ఆయన అంత్యక్రియలకు లక్షల సంఖ్యలో అభిమానులు తరలివచ్చి కన్నీటి వీడ్కోలు పలికారు.
కరుణానిధి నల్ల కళ్లద్దాల వెనుక అసలు కథేమిటో తెలుసా?, పసుపు శాలువా అందుకే!
కాగా, కరుణానిధి పూర్వీకులు తెలుగువారని అందరికీ తెలిసిన విషయమే. కానీ, వారు ఎక్కడ ఉన్నారనే విషయం మాత్రం చాలా మందికి తెలియకపోవచ్చు. కరుణానిధి పూర్వీకులు.. ఆయనకు ముందు రెండు తరాల కిందటివారు ఒంగోలులోనే ఉన్నారు.
చెర్వుకొమ్ముపాలెంలోనే కరుణ పూర్వీకులు
ప్రకాశం జిల్లా ఒంగోలుకు ఆనుకుని ఉన్న చెర్వుకొమ్ముపాలెంలోనే కరుణానిధి పూర్వీకులు నివాసం ఉండేవారు. పెళ్లూరు సంస్థానంలో ఆస్థాన విద్వాంసులుగా పనిచేసేవారు.. ఇవి స్వయానా కరుణానిధి చెప్పిన మాటలే కావడం గమనార్హం. అయితే ఆ మాటలు చెప్పిన కరుణానిధిగానీ, వాటిని ఆలకించిన డిటెక్టిల్ నవలా రచయిత కొంపల్లి బాలకృష్ణగానీ ప్రస్తుతం మన మధ్య లేరు. కానీ, బాలకృష్ణ తన సతీమణి తేళ్ల అరుణతో ఈ విషయంపై స్పష్టనిచ్చారు. వాటిని ఆమె ఓ ప్రముఖ తెలుగు మీడియా ఛానల్తో పంచుకున్నారు.
ఏలూరుకు కరుణ వచ్చిన వేళ
వివరాలు అరుణ మాటల్లోనే.. కరుణానిధికి నవలలు, నవలా రచయితలు అంటే విపరీతమైన అభిమానం. అందులోనూ డిటెక్టివ్ నవలలను విపరీతంగా ఇష్టపడేవారు. అది 1960ల ఆరంభం. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో డిటెక్టివ్ నవలా రచయితల సమావేశం జరిగింది. ఈ సభకు ఒంగోలు నుంచి కొంపల్లి బాలకృష్ణ హాజరయ్యారు. ఆయన డిటెక్టిల్ నవలా రచయిత. విద్యార్థిగా ఉంటూనే పదహారేళ్ల వయసులోనే నవలలు రాసేవారు. ఈ క్రమంలోనే ఏలూరు నుంచి ఆహ్వానం అందడంతో వెళ్లారు. ఆ సభకు కరుణానిధి వచ్చారు. ఈ సందర్భంగా బాలకృష్ణ తనను తాను పరిచయం చేసుకున్నారు.
మా ఒంగోలు ఎలా ఉందంటూ.. కరుణ..
తాను ఒంగోలు నుంచి వచ్చానని కరుణకు చెప్పారు. వెంటనే కరుణ నవ్వుతూ... ‘ఒంగోలా... అయితే మా వాడివే. ఎలా ఉంది ఒంగోలు? మాదీ ఒంగోలే. మా ముత్తాత పెళ్లూరు సంస్థానంలో విద్వాంసులుగా పని చేశారు. తర్వాత పరిస్థితులు బాగాలేక మద్రాసుకు వలస వెళ్లిపోయారు. అక్కడే స్థిరపడ్డాం' అంటూ చెప్పుకొచ్చారు.
ఆయన మాటలు ఒంగోలులో..
ఆ సభ అనంతరం బాలకృష్ణ ఒంగోలు వచ్చి ఆ విషయం అందరికీ చెప్పారు. ఆయన ఒంగోలులోని మంగమ్మ డిగ్రీ కళాశాలలో ప్రధానాచార్యుడిగానూ పని చేశారు. తరచూ తన సన్నిహితుల వద్ద కరుణానిధి చెప్పిన మాటలను చెప్పేవారు. నాలుగేళ్ల కిందట బాలకృష్ణ మరణించారు. తాజాగా కరుణానిధి మరణించారు. కానీ బాలకృష్ణ తన సన్నిహితుల వద్ద చెప్పిన ఈ విషయాలు బయటకు వచ్చాయి. బాలకృష్ణకు కరుణ చెప్పిన మాటలను ఈ సందర్భంగా అరుణ గుర్తు చేసుకున్నారు.