అప్రైజర్ చేతివాటం.. నకిలీ బంగారంతో బ్యాంకుకే బురిడీ.. రూ1.33 కోట్లు గోవిందా
ఓ బ్యాకు అప్రైజర్ చేతివాటం ప్రదర్శించాడు. నకిలీ బంగారు ఆభరణాలను అసలైన బంగారు ఆభరణాలుగా ధ్రువీకరించి రూ.1.33 కోట్లు కొల్లగొట్టాడు.
శ్రీకాకుళం: రాజాంలోని శ్రీకాకుళం రోడ్డులో ఉన్న కరూర్ వైశ్యా బ్యాంకులో అప్రైజర్(బంగారు ఆభరణాల పరిశీలకుడు) గా విధులు నిర్వర్తిస్తున్న ఘరానా మోసగాడు బ్యాంకునే బురిడీ కొట్టించాడు.
నకిలీ బంగారు ఆభరణాలను అసలైన బంగారు ఆభరణాలుగా ధ్రువీకరించి రూ.1,33,55,000 కొల్లగొట్టాడు. 40 మంది ఖాతాదారులతో అతడు ఈ ఘరానా మోసానికి పాల్పడ్డాడు. చివరికి అనూహ్యంగా పట్టుబడ్డాడు.
వివరాల్లోకి వెళితే.. రాజాంలోని కరూర్ వైశ్యా బ్యాంకులో గత ఏడాదిన్నరగా బంగారు ఆభరణాలపై రుణాలు ముమ్మరంగా ఇచ్చారు. ఇటీవల బ్రాంచి మేనేజర్ చంద్రమౌళి రెడ్డి బంగారు ఆభరణాలపై రుణాలు పొంది గడువు ముగిసిన లబ్ధిదారులకు నోటీసులు పంపించారు.
వారి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో బ్రాంచి మేనేజర్ ఆరా తీయడం మొదలెట్టారు. మరోవైపు ఈ ఆభరణాలు వేలం వేసేందుకు గడువు రావడంతో బ్యాంకుకు చెందిన ఉన్నతాధికారులు రెండ్రోజుల క్రితం బ్యాంకుకు చేరుకుని వేలం వేయాల్సిన ఆభరణాలపై ఆరా తీశారు.
వాటిని పరిశీలించగా.. నకిలీ బంగారు ఆభరణాలు బయటపడ్డాయి. దీంతో మరింత లోతుగా పరిశీలించడంతో అసలు విషయం బయటపడింది. అప్రైజర్ నిర్వాకం బయటపడడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సమాచారం అందుకున్న సీఐ శంకరరావు బ్యాంకుకు చేరుకుని ఆరా తీశారు.
మేనేజర్ చంద్రమౌళి రెడ్డి వద్ద ఫిర్యాదు తీసుకుని అప్రైజర్ ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ రుణాలకు సంబంధించి అప్రైజర్ పాత్రతోపాటు బ్యాంకు మేనేజర్ ఇచ్చిన వివరాల ప్రకారం ఖాతాదారులను కూడా వివరించనున్నట్లు సీఐ పేర్కొన్నారు.