మహిళా ఎస్సై మానవత్వం- గుర్తుతెలియని మృతదేహాన్ని మోస్తూ- డీజీపీ ప్రశంసలు
మానవత్వం అనే మాటకు అర్ధమే కరువైపోతున్న కాలంలో అక్కడక్కడ దాన్ని గుర్తు చేసే ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా ఏపీలోనూ ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాలో పొలాల్లో చనిపోయిన ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్ధానికులు బయటికి తెచ్చేందుకు నిరాకరించారు. పోలీసులు కోరినా వారు స్పందించలేదు. దీంతో స్ధానిక మహిళా ఎస్సై ఒకరు ఈ విషయాన్ని ఛాలెంజ్గా తీసుకుని ఓ గుడ్డలో అతన్ని పడుకోబెట్టి కిలోమీటర్ మేర మోసుకెచ్చిన ఘటన మానవత్వానికి మచ్చుతునకలా నిలిచింది.
శ్రీకాకుళంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో రెండు రోజుల క్రితం ఓ గుర్తు తెలియని వ్యక్తి చనిపోయాడు. స్ధానికంగా అడుక్కునే వాడుగా భావిస్తున్న ఈ వ్యక్తి అక్కడి పంటపొలాల్లోకి వెళ్లి గుర్తు తెలియని కారణంతో చనిపోయాడు. ఈ విషయం స్ధానికులకు తెలిసింది. వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి వచ్చినా పొలాల్లో నుంచి మృతదేహం బయటికి తీసుకురావడం కష్టం. స్ధానికంగా పొలాల్లో నుంచి మృతదేహం బయటికి తెచ్చేందుకు రవాణా సౌకర్యం కూడా లేదు.
మంటగలిసిన మానవత్వం
స్ధానికంగా పొలాల్లో నుంచి సదరు మృతదేహాన్ని బయటికి తీసుకొచ్చేందుకు ఎలాంటి రవాణా సౌకర్యాలు లేకపోవడంతో పోలీసులు కూడా స్ధానికుల సహకారం కోరాల్సిన పరిస్దితి. దీంతో వారు కాస్త సాయం చేయాలని అడిగారు. కానీ స్ధానికులు ససేమిరా అన్నారు. అసలే కరోనా పరిస్ధితులు. అనుమానాస్పద మృతదేహం మోసుకొస్తే ఎలాంటి జబ్బులు వస్తాయని భయపడ్డారు. పోలీసులకు సాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు.
మృతదేహాన్ని మోసుకెళ్లిన మహిళా ఎస్సై
పంటపొలాల్లో ఉన్న మృతదేహాన్ని బయటికి తెచ్చేందుకు స్ధానికులు సహకరించకపోవడంతో తానే ఆ పని చేయాలని స్ధానిక మహిళా ఎస్సై శిరీష నిర్ణయించుకున్నారు. దీంతో ఓ గుడ్డను స్ట్రెచర్ రూపంలో తయారు చేసుకుని మరో వ్యక్తితో కలిసి ఆ మృతదేహాన్ని కిలోమేటర్ మేర మోసుకెళ్లారు. ఊర్లోకి తీసుకెళ్లి స్ధానికంగా ఉన్న లలితా మెమోరియల్ ట్రస్టుకు అప్పగించారు. దీంతో వారు ఆ మృతదేహానికి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. స్ధానికుల సహకారం లేకపోయినా భయపడకుండా మానవత్వంతో గుర్తుతెలియని మృతదేహాన్ని మోసుకెళ్లిన మహిళా ఎస్సై శిరీష మానవత్వం చాటుకున్నారు.
ట్విట్టర్లో శిరీషకు డీజీపీ ప్రశంసలు
రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన జిల్లాలో విధులు నిర్వర్తిస్తూ గుర్తు తెలియని మృతదేహం విషయంలో మానవత్వం చాటుకున్న ఎస్సై శిరీషపై ప్రశంసల జల్లు కురుస్తోంది. శిరీష మృతదేహాన్ని మోసుకెళ్తున్న వీడియోను ట్విట్టర్లో పోస్టు చేసిన ఏపీ పోలీసు శాఖ ఆమె పనితీరుపై ప్రశంసలు కురిపించింది. శిరీష మానవత్వంపై డీజీపీ గౌతం సవాంగ్ అభినందిస్తూ ఓ సందేశం పెట్టారు. దీంతో ఇప్పుడు శిరీష చేసిన పని ట్విట్టర్లో సైతం వైరల్ అవుతోంది.