గంటా కూతురు పెళ్లి: మంత్రులు కాసు, ఏరాసు స్టెప్పులు
విశాఖపట్నం: రాష్ట్ర మంత్రులు కాసు వెంకట కృష్ణా రెడ్డి, ఏరాసు ప్రతాప రెడ్డిలు సోమవారం డ్యాన్స్ చేసి అలరించారు. వారు డ్యాన్స్ చూసి సహచరులు చప్పట్లు కొట్టి ఉల్లాసంగా గడిపారు. మంత్రులిద్దరూ విశాఖపట్నంలో డ్యాన్సర్ల అవతారం ఎత్తారు.
సరదాగా స్టెప్పులేసి అందరినీ అలరించారు. రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక సదుపాయాల మంత్రి గంటా శ్రీనివాస రావు కూతురి వివాహాన్ని పురస్కరించుకుని ఏర్పాటైన సంగీత్ కార్యక్రమంలో ఈ సరదా సన్నివేశం చోటు చేసుకుంది. సోమవారం రాత్రి నిర్వహించిన సంగీత్ కార్యక్రమంలో కాసు, ఏరాసు డాన్స్ చేసి ఔరా అనిపించారు.
అక్కినేని నాగేశ్వర రావు పాటలకు ఉత్సాహంగా నృత్యాలు చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. ఒత్తిళ్లు, రాజకీయాలు అన్నీ పక్కనపెట్టి స్టెప్పులు వేశారు. మంత్రి కాసు వెంకటకృష్ణా రెడ్డి గంటా కుమార్తెతో కలిసి స్టెప్పులు వేశారు. మంత్రి ఏరాసు శాస్త్రీయ నృత్యం అభినయించారు. అక్కినేని నాగేశ్వర రావు సినిమాల్లోని పాటలకు మంత్రులు డ్యాన్స్ చేశారు. గంటా శ్రీనివాసరావు కుమార్తె వివాహం బుధవారం జరగనుంది.
కాగా, గంటా శ్రీనివాస రావు కుమార్తె వివాహానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు వెళ్లనున్నారు. కూతురు పెళ్లి కోసం గంటా భారీ ఏర్పాట్లు చేశారు.