అనుచరులతో ఏప్రిల్ 18న కాటసాని సమావేశం, బిజెపికి షాకిస్తారా?
కర్నూల్: కర్నూల్ జిల్లా పాణ్యం మాజీ ఎమ్మెల్యే, బిజెపి నేత కాటసాని రాంభూపాల్రెడ్డి ఏప్రిల్ 18వ తేదిన అనుచరులతో సమావేశం కానున్నారు. బిజెపిని కాటసాని వీడేందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారనే ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయాన్ని కాటసాని రాంభూపాల్ రెడ్డి మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. కార్యకర్తల సమావేశంలో ఈ విషయమై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
కర్నూల్ జిల్లా రాజకీయ సమీకరణాల్లో మార్పులు చోటు చేసుకొనే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్నందున రాజకీయ పార్టీల నేతలు తమ రాజకీయ భవిష్యత్ కోసం అడుగులు వేస్తున్నారు.
కాటసాని రాంభూపాల్ రెడ్డి అనుచరులతో సమావేశం నిర్వహించడం కూడ ఇందులో భాగమేనని ప్రచారం సాగుతోంది. ఎన్నికలకు సమయం సమీపిస్తున్న తరుణంలో కాటసాని తన అనుచరులతో సమావేశం నిర్వహించడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకొంది.
అనుచరులతో కాటసాని సమావేశం
ఏప్రిల్ 18వ తేదిన అనుచరులతో సమావేశం కావాలని పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి భావిస్తున్నారు. గత ఎన్నికల తర్వాత కాటసాని రాంభూపాల్ రెడ్డి బిజెపిలో చేరారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కాటసాని రాంభూపాల్ రెడ్డి కార్యకర్లతో సమావేశం ఏర్పాటు చేయడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకొంది. ఆయన బిజెపిని వీడే అవకాశాలున్నాయనే ప్రచారం సాగుతోంది. కానీ, ఈ విషయాన్ని కాటసాని రాంభూపాల్ రెడ్డి మాత్రం అధికారికంగా ధృవీకరించలేదు. ఈ సమావేశంలో కీలక నిర్ణయాన్ని కాటసాని రాంభూపాల్ రెడ్డి ప్రకటించే అవకాశం లేకపోలేదంటున్నారు.
పాణ్యం నుండి ఐదు సార్లు గెలిచిన కాటసాని
కర్నూల్ జిల్లా పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాటసాని రాంభూపాల్ రెడ్డి మూడు దఫాలు కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసి విజయం సాధించారు. 1985 లో పాణ్యం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి టిడిపి అభ్యర్ధి సత్యనారాయణరెడ్డిపై విజయం సాదించి తొలిసారిగా ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టారు. 1989, 1994 లో కూడ ఆయన ఇదే స్థానం నుండి విజయం సాధించారు. 1999లో మాత్రం టిడిపి అభ్యర్ధి బిజ్జం పార్థసారధిరెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. 2004లో పార్థసారధిరెడ్డిని ఓడించారు. 2009లో టిడిపి అభ్యర్ధి బైరెడ్డి రాజశేఖర్రెడ్డిని ఓడించారు. గత ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేసి ఆయన ఓటమి పాలయ్యారు.
వైసీపీలో చేరుతారా
పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి వైసీపీలో చేరుతారా అనే చర్చ కూడ లేకపోలేదు. బిజెపిని వీడి వైసీపీలో చేరేందుకు ఎక్కువ అవకాశాలున్నాయని ఆయన సన్నిహితుల్లో ప్రచారంలో ఉంది. అయితే ఈ విషయమై ఏప్రిల్ 18వ తేదిన జరిగే సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం లేకపోలేదు.వైసీపీలో చేరితే ఆయనకు ఎక్కడి నుండి బరిలోకి దింపుతారనే చర్చ కూడ సాగుతోంది. ప్రస్తుతం పాణ్యం స్థానం నుండి గౌరు చరితా ఎమ్మెల్యే కొనసాగుతున్నారు.
కాటసాని సమావేశానికి రాజకీయ ప్రాధాన్యత
ఏప్రిల్ 18వ తేదిన కాటసాని రాంభూపాల్ రెడ్డి తన అనుచరులతో ఏర్పాటు చేసే సమావేశానికి రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది. కాటసాని ఈ సమావేశంలో తీసుకొనే నిర్ణయం కర్నూల్ జిల్లాపై పడే అవకాశం లేకపోలేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే ప్రస్తుతం సాగుతున్న ప్రచారానికి కాటసాని తెర దించుతారా, లేదా అనేది ఈ సమావేశంలో తేలనుంది.