పవన్తోపాటు బాబు, జగన్లనూ వదిలిపెట్టని కత్తి మహేష్: కేసీఆర్పై ఇలా..
ఇప్పటికే ప్రముఖ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అభిమానుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Recommended Video
హైదరాబాద్: ఇప్పటికే ప్రముఖ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అభిమానుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయాలపై ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికే పవన్ రాజకీయ ప్రవేశంపై వ్యాఖ్యలు చేసి ఆయన అభిమానుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.
గందరగోళంలో ఓటర్లు
ఏపీ ఓటర్లు ప్రస్తుతం చాలా గందరగోళంలో ఉన్నారని కత్తి మహేష్ చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఒక మేనిఫెస్టోతో ప్రజల ముందుకు వచ్చారని, ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఆయన మేనిఫెస్టోకు సంబంధం లేకుండా ఉందని అన్నారు.
బాబు అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారు..
ప్రజలకు చంద్రబాబు అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారన్న కత్తి మహేష్.. ఆ అరచేతిలో స్వర్గం ఎప్పుడు వస్తుందో అర్థం కావడం లేదని చెప్పారు. చంద్రబాబు కొత్త ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందని మహేష్ అభిప్రాయపడ్డారు.
జగన్ పార్మీని నమ్మలేం
అంతేగాక, ప్రతిపక్షమైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటో అర్థం కావడం లేదని అన్నారు. ప్రతిపక్ష పార్టీగా ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి కౌంటర్ ఇచ్చుకుంటూ వెళ్లాల్సిన అవసరం ఉందని మహేష్ అన్నారు. ప్రతిపక్షం చేయాల్సిన పనిని ఆ పార్టీ చేయడం లేదని, అందువల్ల వైయస్ జగన్మోహన్ రెడ్డిని, ఆయన పార్టీని నమ్మలేమని అన్నారు.
పవన్ ఎంట్రీతో మరింత గందరగోళం..
మేనిఫెస్టోను అమలు చేయలేని టీడీపీని కూడా ఇప్పటికిప్పుడు నమ్మలేమని కత్తి మహేష్ చెప్పారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా తాను రాజకీయాల్లోకి ఫుల్టైమ్ ఎంట్రీ ఇస్తానని చెబుతున్నారని.. ఈ నేపథ్యంలో ప్రజలు ఎవరివైపు ఉండాలనే విషయంలో గందరగోళంలో పడ్డారని తెలిపారు.
క్లారిటీ వస్తేనే..
అసలైన రాజకీయం ఇప్పట్నుంచే ప్రారంభమవుతుందని కత్తి మహేష్ చెప్పారు. ప్రతి ఒక్క పార్టీ కూడా ఇప్పుడు ఒక క్లారిటీ ఇవ్వాల్సి ఉందని, అప్పుడే ఎవరివైపు ఉండాలనే విషయాన్ని ప్రజలు నిర్ణయించుకునే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు.
తెలంగాణలో మాత్రం సానుకూలం
తెలంగాణలో మాత్రం కొంచెం క్లారిటీ ఉందని కత్తి మహేష్ అన్నారు. తెలంగాణ సెంటిమెంట్తో టీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పారు. అంటే మహేష్ అభిప్రాయం ప్రకారం ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి అధికారం చేపట్టనున్నారు.
వేచిచూడాల్సిందే..
ఏపీలో మాత్రం పూర్తి గందరగోళమేనని కత్తి మహేష్ అన్నారు. ఇప్పటికప్పుడు ఏపీలో ఏం జరుగబోతోందో చెప్పలేమని.. ప్రతి నెలా మారే పరిణమాలతో చాలా మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని అన్నారు. అందుకే ఇప్పుడే ఏదీ చెప్పలేమని, వేచిచూడాల్సిందేనని స్పష్టం చేశారు.