టీడీపీ నేతను వైసీపీ నాయకులు రహస్యంగా కలిశారా? జగన్ వద్దకు ఫోటోలు!
Recommended Video
నెల్లూరు: ఎస్పీఎస్ నెల్లూరు జిల్లా కావలి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చిచ్చు రాజుకుంది. వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డిల మధ్య పోరు నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ఒత్తిడితో విష్ణు వర్గీయులను నలుగురిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారని ఆరోపణలు రావడం దుమారం రేపుతోంది.
గత ఏడాది నియోజకవర్గ సమావేశంలో విష్ణు వర్గీయులు రామిరెడ్డిపై విమర్శలు గుప్పించారు. అప్పుడే ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ఓ ప్రకటన చేశారు. ఈసారి వైసీపీ ఎమ్మెల్యేగా రామిరెడ్డి పోటీ చేస్తారని ప్రకటించారు. ఇది విష్ణు వర్గీయులకు ఆగ్రహం తెప్పించింది. విష్ణు వర్గీయులు నలుగురు అల్లూరు మండలం కన్వీనర్తో వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలో వారిపై వేటు వేయాలని ఆలోచన చేశారని అంటున్నారు.
అందుకే వేటు పడిందని
ఈ నేపథ్యంలో వారిపై వేటు పడిందని అంటున్నారు. ఈ నెల 3న జిల్లా కన్వీనర్ కాకాణి గోవర్ధన్ రెడ్డి పేరుతో షోకాజ్ నోటీసులు జారీ చేసి, ఆ నలుగురిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ పార్టీ ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారని, మీపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా ఎమ్మెల్యే రామిరెడ్డి సూచనల మేరకు ఈ నోటీసులు జారీ చేశారని కాకాని పేర్కొన్నారు.
వారిని నిలదీసిన నాయకులు
ఈ నోటీసులు అందుకున్న నలుగురు.. ఎమ్మెల్యే, మండల కన్వీనర్ ఏ సిఫార్సుల మేరకు ఇలా చేశారో చెప్పాలని నిలదీశారు. దీంతో వివాదం మరింత రాజుకుందని తెలుస్తోంది.
బీదా రవిచంద్రతో వారి భేటీ
మరోవైపు, జనవరి 1న అల్లూరు మండల వైసీపీ కన్వీనర్ దండా కృష్ణా రెడ్డి, వైసీపీ నేత ఆళ్ల సుధాకర్ రెడ్డిలు టీడీపీ జిల్లా అధ్యక్షులు బీద రవిచంద్రను కలిసి అభినందనలు తెలిపారని విష్ణు వర్గీయులు వెల్లడిస్తున్నారు. ఈ ఇద్దరు ఎమ్మెల్యేకు ముఖ్య అనుచరులుగా ఉంటూ, మరోవైపు బీదతో సఖ్యతగా ఉంటూ రూ.10 కోట్ల వర్కులు చేస్తున్నారని ఆరోపించారు.
రహస్యంగా కలిసిన వారిని వదిలి
అలా రహస్యంగా కలిసి అభినందనలు తెలిపన వారిని వదిలి పార్టీ కోసం పని చేస్తున్న తమను పార్టీ నుంచి సాగనంపటం ఏమిటని జగన్ను కలిసి ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు బీదను కలిసిన ఫోటోలు, షోకాజ్ నోటీసులు జగన్కు అందించారని తెలుస్తోంది. తాను జిల్లాకు వచ్చాక మాట్లాడుతానని జగన్ వారికి చెప్పారని సమాచారం.