ముహుర్తం కుదిరింది: 18న వైసీపీ నుంచి టీడీపీలోకి కావలి ఎమ్మెల్యే?
అమరావతి: ఏపీ అధికార పార్టీ టీడీపీ చేపట్టిన 'ఆపరేషన్ ఆకర్ష్'లో భాగంగా వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆకర్ష్ లో భాగంగా వైసీపీకి చెందిన 17 మంది ఎమ్మెల్యేలు చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్ధం పుచ్చుకున్న సంగతి తెలిసిందే.
తాజాగా నెల్లూరు జిల్లా నుంచి వైసీపీకి చెందిన కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే జిల్లాకు చెందిన మంత్రి నారాయణ, మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డిలతో పలు దఫాలుగా చర్చలు జరిపిన రామిరెడ్డి పార్టీ మారేందుకే నిర్ణయించుకున్నట్లు సమాచారం.
ఇందులో భాగంగానే ఈ నెల 6వ తేదీన రామిరెడ్డి టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడితో భేటీ అయినట్లు సమాచారం. ఈ సందర్భంగా రామిరెడ్డి టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పడంతో అందుకు సరేనన్న చంద్రబాబు మంత్రి నారాయణను రామిరెడ్డితో మాట్లాడాల్సిందిగా సూచించారు.
దీంతో రంగంలోకి దిగిన మంత్రి నారాయణ, ఆనం రామనారాయణరెడ్డిలు రామిరెడ్డితో విడతల వారీగా చర్చలు జరిపారని.... ఈ చర్చల్లో ఒకటి అరా డిమాండ్లు మినహా మిగిలిన అన్నింటి విషయంలో రామిరెడ్డికి గట్టి హామీ లభించడంతో సైకిలెక్కేందుకు ఆయన సిద్ధమైనట్లు సమాచారం.
ప్రస్తుతం విదేశీ పర్యనటలో ఉన్న చంద్రబాబు ఆ పర్యటన నుంచి ఈనెల 15న విజయవాడకు తిరిగి రానున్నారు. అనంతరం ఈ నెల 18న రామిరెడ్డి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారని సమాచారం. రామిరెడ్డి వైసీపీ నుంచి టీడీపీలోకి చేరితే నెల్లూరు జిల్లాలోనే ఫిరాయింపు ఎమ్మెల్యేల సంఖ్య రెండుకు చేరుతుంది. ఇప్పటికే గూడురు ఎమ్మెల్యే సునీల్ కుమార్ టీడీపీలో చేరారు.
టీడీపీలో చేరేది లేదు: కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి
తాను వైసీపీని వీడి టీడీపీలోకి చేరుతున్నట్లు వస్తున్న వార్తలపై నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి బుధవారం స్పందించారు. ఓ తెలుగు న్యూస్ ఛానెల్తో మాట్లాడుతూ తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారమంతా అబద్ధమేనని చెప్పారు.
తన పార్టీ మార్పుపై ఇటీవల పలు వార్తా కథనాలు ప్రసారమయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వార్తలన్నీ అసత్యాలేనని ఆయన పేర్కొన్నారు. వైయస్ జగన్కు అండగా ఉంటానని, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని తాను వీడేదిలేదని ఆయన స్పష్టం చేశారు.