తొక్కి పెట్టాలని చూస్తే జాగ్రత్త: బాబుకు కవిత హెచ్చరిక, దేవీప్రసాద్ రిజైన్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన తెలంగాణ రాష్ట్ర నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత శుక్రవారం నాడు తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. తెలంగాణలోని తెరాస జెండా తప్ప మరే జెండా కనిపించడం లేదన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో గెలుస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.
శుక్రవారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సోమాజీగూడ మాజీ కార్పోరేటర్ మహేష్ యాదవ్ తెరాసలో చేరారు. కవిత, హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డిల సమక్షంలో చేరారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడారు. ఆంధ్రా పాఠ్య పుస్తకాలలో తెలంగాణ చరిత్ర పెట్టనని చంద్రబాబు అంటున్నారన్నారు.
తెలంగాణ ఉద్యమ చరిత్రను తొక్కిపెట్టాలని చూస్తే చంద్రబాబే చరిత్రలో లేకుండా పోతారని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమం ప్రజా ఉద్యమ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. తెలంగాణ ప్రజల కోసమే ఉద్యమం చేశామన్నారు. పార్టీలో చేరుతున్న నాయకులకు సముచిత గౌరవం కల్పిస్తామని చెప్పారు.
హోం మంత్రి నాయిని మాట్లాడుతూ.. తెలంగాణలో ఉన్నవారంతా ఇక్కడి వారేనని, తెలంగాణ బిల్లు పాసైన రోజే కేసీఆర్ చెప్పారన్నారు. కేసీఆర్ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ప్రజలు తెరాస వైపు వస్తున్నారన్నారన్నారు. ఏ సీఎం తీసుకొని నిధంగా కేసీఆర్ నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు.
తెలంగాణ వ్యాప్తంగా తెరాస హవానే నడుస్తోందన్నారు. కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి జనం పెద్ద ఎత్తున తెరాస వైపు చూస్తున్నారన్నారు. మేనిఫెస్టోలో చెప్పని అంశాలు కూడా తెరాస చేస్తోందన్నారు. ప్రజా సంక్షేమమే తమకు ముఖ్యమన్నారు. అందుకు కళ్యాణ లక్ష్మి ఓ ఉదాహరణ అన్నారు.
ఉద్యోగానికి దేవీప్రసాద్ రాజీనామా
రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయనున్న నేపథ్యంలో తెలంగాణ ఎన్జీవోల నేత దేవీప్రసాద్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. తెరాస పార్టీ తరఫున ఆయన ఎమ్మెల్సీ బరిలోకి దిగనున్నారు. దేవీప్రసాద్ మెదక్ ఇరిగేషన్ శాఖలో అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన రాజీనామాను అధికారులు ఆమోదించాల్సి ఉంది.