నాతో పెట్టుకోకు: జైరాంని ఏకిపారేసిన కావూరి, హెచ్చరిక
న్యూఢిల్లీ: కేంద్రమంత్రి జైరామ్ రమేష్ పైన ఏలూరు పార్లమెంటు సభ్యులు కావూరి సాంబశివ రావు గురువారం నిప్పులు చెరిగారు. నాలుగు ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడినంత మాత్రాన మేధావి అయిపోతారా అని ఎద్దేవా చేశారు. మంత్రి పదవికి కావూరి రాజీనామా, బిజెపిలోకి చేరుతారనే వార్తల నేపథ్యంలో జైరామ్ రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాపారాల కోసమే కావూరి బిజెపి వైపు వెళ్తున్నారన్నారు.
దీనిపై కావూరి మండిపడ్డారు. తాను ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ కోసం దివంగత పివి నర్సింహా రావుకు దూరమయ్యానని చెప్పారు. సీమాంధ్ర ప్రాంతంలో కాంగ్రెసు పార్టీ ఒక్క సీటు కూడా గెలువదన్నారు. సీమాంధ్రలో ప్రస్తుత పరిస్థితికి జైరామ్ రమేషే కారణమన్నారు.
ఎన్నికలలో గెలువలేని జైరామ్ రమేష్ తమకు చెప్పడమేమిటన్నారు. ప్రజల మద్దతు లేని, ఎన్నికలలో గెలువలేని జైరాం వంటి వారిని ప్రోత్సహించవద్దని నిప్పులు చెరిగారు. ఉపాధి హామీ పథకానికి ఇచ్చే నిధులను యువతలో నైపుణ్యం అభివృద్ధికి కేటాయించాలని తాను చెప్పానన్నారు.
నాలుగు ఇంగ్లీష్ ముక్కలు నేర్చుకుంటే విజ్ఞాని అయిపోరన్నారు. పార్లమెంటుకు ఎన్నిక కాలేని వారు తనను అనడమేమిటన్నారు. జైరామ్ తన పైన చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు చెప్పారు. జైరాం వంటి వారు ప్రజల్లో దమ్మిడికి పనికి రాని వారన్నారు. సోనియా కోసం తాను బంగారం లాంటి పివికి దూరమయ్యానని, వ్యాపారాల కోసమే అయితే.. తాను అప్పుడు పివితోనే ఉండేవాడినన్నారు.
రెండు పుస్తకాలు చదివి, నాలుగు ఇంగ్లీష్ ముక్కలు చదివిన వారే పార్టీకి అవసరమైతే ఇంకా చాలామంది ఉన్నారన్నారు. అసలైన కాంగ్రెసు ద్రోహులు జైరాంలాంటి వాళ్లే అన్నారు. మీడియా ఉంది కదా అని నోటికి వచ్చినట్లు మాట్లాడవద్దని మండిపడ్డారు. జైరాం ఓ కుహానా మేధావి అన్నారు. నా కంపెనీలలో ఎలాంటి తప్పు లేదని, తప్పు చేసినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని సవాల్ చేశారు.
మిగిలిన వారి గురించి మాట్లాడినట్లు తన గురించి మాట్లాడితే బాగుండదని హెచ్చరించారు. తన గురించి మరోసారి ఇలాగే మాట్లాడితే జైరాం బాగోతం బయటపెడతానన్నారు. కాగా, కావూరి సాంబశివ రావు గురువారం ఉదయం ప్రధాని మన్మోహన్ సింగ్ను కలిసి కేంద్రమంత్రి పదవికి రాజీనామా ఇచ్చిన విషయం తెలిసిందే.