ఏపీని అడ్డంగా చీల్చి: సోనియాపై మండిపడ్డ కావూరి, కన్నా, టీడీపీ పైనా
హైదరాబాద్: ప్రత్యేక హోదా విషయంలో భారతీయ జనతా పార్టీని తప్పుపట్టడం పైన ఆ పార్టీ నేతలు కావూరి సాంబశివ రావు, కన్నా లక్ష్మీనారాయణలు ఏపీ కాంగ్రెస్ పార్టీ నేతల పైన భగ్గుమన్నారు.
ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీని ప్రధానిని చేయడం కోసం సోనియా గాంధీ రాష్ట్రాన్ని అడ్డంగా చీల్చారని ఆరోపించారు. ఇప్పుడేమో ప్రత్యేక హోదా పైన కాంగ్రెస్ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు.
ప్రత్యేక హోదా రాకుండా అడ్డుపడుతోంది కూడా కాంగ్రెస్ పార్టీనే అని విమర్శించారు. ప్రత్యేక హోదా కోరుతున్న ఇతర రాష్ట్రాలను కూడా ఆ పార్టీ రెచ్చగొడుతోందన్నారు. విభజన చట్టం అమలు చేయడానికి బిజెపి కట్టుబడి ఉందన్నారు.
టిడిపి నేతల పైన కూడా వారు విరుచుకు పడ్డారు. కేంద్ర ప్రభుత్వం చేసిన సాయం గురించి, వచ్చిన నిధుల గురించి మాట్లాడకుండా కేవలం ప్రత్యేక హోదా గురించి మాట్లాడటం సరికాదన్నారు.
ప్రతి కుటుంబం మరుగుదొడ్డి నిర్మించుకోవడాన్ని బాధ్యతగా భావించాలని స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు అన్నారు. ఎస్పీఎస్ నెల్లూరు జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడలంటే గ్రామాల్లో ఇంటికో మరుగుదొడ్డి ఉండాలన్నారు.
గుంటూరుకు చేరిన బస్సుయాత్ర
ఏపీకీ ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ సిపిఐ చేపట్టిన బస్సు యాత్ర గుంటూరు జిల్లాకు చేరుకుంది. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆధ్వర్యంలో ఈ బస్సు యాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ.. 10వ తేదీలోపు ప్రత్యేక హోదాపై ప్రకటన చేయాలని లేదంటే 11న ఏపీ బంద్కు పిలుపిస్తామన్నారు.