వ్యాపారాల కోసమే: కావూరిపై జైరాం భగ్గు, హర్ష వివరణ
న్యూఢిల్లీ/హైదరాబాద్: కావూరి సాంబశివ రావు పైన కేంద్రమంత్రి జైరామ్ రమేష్ గురువారం ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెసు పార్టీలో ఎన్నో పదవులు అనుభవించిన కావూరి ఇప్పుడు పార్టీని వీడటం వెన్నుపోటే అన్నారు. తన వ్యాపారం కోసమే కావూరి కాంగ్రెసు పార్టీని వీడారని ఆరోపించారు.
భారతీయ జనతా పార్టీ ద్వారా వ్యాపారాలను కాపాడుకోవాలని ఆయన చూస్తున్నారన్నారు. కావూరి, ఆయన కుమారుడి కాంట్రాక్టుల వల్ల ఎన్నోసార్లు కేంద్రం ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చిందని ధ్వజమెత్తారు. కేవలం వ్యాపార ప్రయోజనాల కోసమే కావూరి పార్టీ మారుతున్నారన్నారు. 30 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న కావూరికి సిద్ధాంతం లేదన్నారు.
జెఏస్పీ నుండే: హర్ష కుమార్
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తాను జై సమైక్యాంధ్ర పార్టీ తరపున అమలాపురం నుంచే పోటీ చేస్తానని హర్ష కుమార్ తేల్చి చెప్పారు. దాదాపు పార్టీ అభ్యర్థుల ఎంపిక పూర్తయిందన్నారు. తమ పార్టీని ప్రజలు ఆదరిస్తున్నారని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన కేంద్రానికి ప్రజలు గుణపాఠం చెబుతారని, విలువల ప్రాతిపదికనే రాజకీయాలు నడపాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. కాగా, హర్ష కుమార్కు దిగ్విజయ్ సింగ్ ఫోన్ చేసి తిరిగి కాంగ్రెసు పార్టీలోకి రావాలని ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హర్ష వివరణ ఇచ్చారు.
కోదండతో ఓయు జెఏసి భేటీ
తెలంగాణ ఐకాస చైర్మన్ ఆచార్య కోదండరాంతో ఓయూ ఐకాస నేతలు గురువారం సమావేశమయ్యారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట నుంచి పోటీ చేస్తున్న ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు ఐకాస మద్దతు ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు. అయితే వచ్చేఎన్నికల్లో ఎవరికి మద్దతివ్వాలన్న దానిపై స్టీరింగ్ కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కోదండరాం చెప్పారు.