బీజేపీదే బాధ్యత: కావూరి, బాబు-మోడీపై నారాయణ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన శాస్త్రీయంగా జరగలేదని, ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రం పైన ఉందని మాజీ కేంద్రమంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత కావూరి సాంబశివ రావు బుధవారం అన్నారు. దేశ ప్రజల ఆకాంక్షను తీర్చడమే కేంద్రం లక్ష్యమన్నారు.
అమ్మాయిలు అందాల పోటీల్లో ఏవిధంగా పాల్గొంటారో ప్రధాని నరేంద్ర మోడీ కూడా విదేశీ పర్యటనల్లో ఆ విధంగా పాల్గొంటున్నారని సీపీఐ నేత నారాయణ బుధవారం నాడు తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు.
జపాన్ పర్యటనలో ప్రధాని మోడీ 14 డ్రస్సులు మార్చారన్నారు. మోడీకి బయటకు కనపడని కేబినెట్ మరొకటి ఉందని ఆరోపించారు. మోడీ ఏడాది పాలనలో ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు. టీడీపీ మహానాడులో ప్రత్యేక హోదాపై తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు.
ప్రత్యేక హోదాపై కార్యాచరణ ప్రకటించాలని లేదంటే భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వాలపై ఉద్యమం తప్పదని హెచ్చరించారు. హైదరాబాద్ను విడిచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాలేకపోతున్నారని ఆయన విమర్శించారు.