అప్పుడే: కెసిఆర్కు కావూరి, హింసమార్గమైనా: సబ్బం
హైదరాబాద్/విశాఖ: పోలవరం విషయంలో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు రాద్దాంతం చేయవద్దని కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివ రావు బుధవారం హితవు పలికారు. నాడు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందున అప్పట్లో ఆర్డినెన్స్ జారీ చేయలేదన్నారు. విభజన విషయంలో యూపిఏ తొందరపడిందని, బిజెపి న్యాయం చేస్తామని చెప్పిందన్నారు. విస్తరణ సమయంలో మోడీ మంత్రివర్గంలో తెలంగాణకు న్యాయం జరుగుతుందని చెప్పారు.
వెంకయ్య నాయుడు, అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, రవిశంకర ప్రసాద్ అప్పట్లో ప్రతిపక్షంలో ఉండగానే కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో నిర్ణయం తీసుకున్నదని తెలుసుకోవాలన్నారు. ఇంకా చాలా నిర్ణయాలు ఉన్నాయని, అవన్నీ రాష్ట్ర విభజన సందర్భంగా తీసుకున్నవేనని, వాటిని వివాదం చేయడం శుద్ధ దండగ అన్నారు. పోలవరం పేరుతో రెండు ప్రాంతాల మధ్య ఉద్రిక్తలు సృష్టించవద్దన్నారు.
అలా అయితేనే న్యాయం: సబ్బం
పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రలో కలిపినంత మాత్రాన ఆంధ్రప్రదేశ్కు న్యాయం చేసినట్లు కాదని, లక్ష కోట్ల రూపాయలు ఇవ్వాలని మాజీ ఎంపీ సబ్బం హరి అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో ఎవరికీ ఇబ్బంది ఉండదన్నారు. దాన్ని ఆపే ప్రయత్నాలు చేయొద్దని తెరాసకు హితవు పలికారు.
పోలవరాన్ని అడ్డుకుంటే హింసామార్గాలకు వెనుకాడమని హెచ్చరించారు. ముంపు ప్రాంత ప్రజలను ఆదుకునేందుకు డిమాండ్ చేయొచ్చన్నారు. ముంపు ప్రాంతాలు కలపడం న్యాయబద్ధమైనది కాబట్టే చేశారన్నారు. తెరాస ముంపు ప్రాంతాలను ఆదుకునేందుకు డిమాండ్ చేయవచ్చునని చెప్పారు. విభజనలోనే తమకు అన్యాయం జరిగిందని, ఇప్పుడు పోలవరం ఆపితే ఎలా అన్నారు.
బంద్కు మద్దతు
పోలవరంపై కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కెసిఆర్ రేపు బంద్కు పిలుపునివ్వటంతో.. పలు సంఘాలు మద్దతు తెలిపాయి. తెలంగాణ పొలిటికల్ ఐకాస, తెలంగాణ ఉద్యోగ సంఘాల ఐకాస, టిఎంయూ, తెలంగాణ లాయర్స్ ఐకాస, ఆర్టీసి ఐకాస తమ మద్దతు ప్రకటించాయి.