సోనియా కోప్పడ్డారు: కావూరి, నామా దాడి: మోదుగుల
ఏలూరు/ న్యూఢిల్లీ: తెలంగాణ బిల్లుకు వ్యతిరేకంగా తాను వెల్లోకి వెళ్లినందుకు తమ కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తనపై ఆగ్రహం వ్యక్తం చేశారని సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రి కావూరి సాంబశివ రావు చెప్పారు. సీమాంధ్రకు జరుగుతున్న అన్యాయాన్ని సహించలేక తాను సభలో వెల్లోకి వెళ్లానని ఆయన శనివారం పశ్చిమ గోదావరి జిల్లాలో శనివారంనాడు చెప్పారు.
సీమాంధ్రకు జరుగుతున్న అన్యాయం గురించి ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోలేదని, అందువల్లనే వెల్లోకి వెళ్లానని తాను సోనియా గాంధీకి చెప్పినట్లు ఆయన తెలిపారు. నిజానికి, కేబినెట్ మంత్రిగా ఉంటూ వెల్లోకి వెళ్లడం సంప్రదాయం కాదని ఆయన అన్నారు. దాంతో తాను వెల్లోకి వెళ్లిన సమయంలో సోనియా గాంధీ తనపై ఆగ్రహం వ్యక్తం చేశారని ఆయన వివరించారు.
తన రాజీనామా వార్తలు ఊహాగానాలు మాత్రమేనని ఆయన అన్నారు. భద్రాచలాన్ని సీమాంధ్రలో కలపాల్సిందేనని, అలా చేయకపోతే తెలంగాణ బిల్లు ముందుకు వెళ్లదని ఆయన అన్నారు. రాష్ట్రాలను విభజించుకుంటూ పోతే దేశం ముక్కలవుతుందని ఆయన అన్నారు. మూజువాణి ఓటుతో తెలంగాణ బిల్లు ఆమోదం పొందకుండా చూస్తామని ఆయన అన్నారు.
నామా నాగేశ్వర రావు తమ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కారని, కొనకళ్ల నారాయణే తమ నాయకుడని తెలుగుదేశం పార్టీ సీమాంధ్ర పార్లమెంటు సభ్యుడు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని కావాలనీ తాను హీరో కావాలనీ నామా నాగేశ్వర రావు తనపై దాడి చేశారని ఆయన ఆరోపించారు. కాంగ్రెసు ఎంపి లగడపాటి రాజగోపాల్పై తమిళనాడు పార్లమెంటు సభ్యుడు దాడి చేశాడని ఆయన అన్నారు.
తెలంగాణ బిల్లును లోకసభలో ప్రవేశపెట్టలేదని, బిల్లును ప్రవేశపెట్టినట్లు సాంకేతికంగా రికార్డుల్లో లేదని ఆయన అన్నారు. తెలంగాణ బిల్లు కోసం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్ నాథ్ నివాసంలో లేదా స్పీకర్ మీరా కుమార్ నివాసంలో సమావేశం పెట్టుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీలకు అతీతంగా సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు ఏకం కావాల్సిన సమయం వచ్చిందని ఆయన అన్నారు. కమల్నాథ్ కనుసైగల్లోనే స్పీకర్ పనిచేస్తున్నారని ఆయన అన్నారు.