టిడిపి బలహీనపడుతోంది: కావూరి షాక్, చంద్రబాబు మాట్లాడరేం: వీర్రాజు
ఏలూరు: మాజీ కేంద్రమంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత కావూరి సాంబశివ రావు మంగళవారం నాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో టిడిపి క్రమంగా బలహీనపడుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే, ఏపీలో లంచగొండితనం కూడా పెరిగిపోతోందన్నారు.
ఏపీలో బిజెపికే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఏపీకి అవసరమైన సాయం చేసేందుకు బిజెపి సిద్ధంగా ఉందని అభిప్రాయపడ్డారు.
సాధ్యమైన సాయం చేస్తుందన్నారు. దేశంలో అవినీతిని రూపుమాపాలని, అభివృద్ధిలో నిలపాలని ప్రధాని మోడీ ముందుకు వెళ్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి బలిష్టంగా తయారవుతుందన్న నమ్మకం ఉందని కావూరి అన్నారు.
దిష్టిబొమ్మలపై చంద్రబాబు మాట్లాడాలి: సోము వీర్రాజు
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మలను రాష్ట్రంలోని పలుచోట్ల దగ్ధం చేస్తుండటంపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తీవ్రంగా స్పందించారు. ఈ విషయంపై సీఎం చంద్రబాబు స్పందించాలని డిమాండ్ చేశారు.
ఒక్క ప్రత్యేక హోదాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమనే భావన సరికాదన్నారు. ముప్పై సంవత్సరాలకు పైగా ప్రత్యేక హోదా ఉన్న అస్సోం రాష్ట్రం ఇప్పటికీ ఎందుకు అభివృద్ధి చెందలేదో తెలుసుకోవాలన్నారు. ఏపీకు హోదా ఇవ్వడంలో కేంద్రానికి ఇబ్బందులున్నాయన్నారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం హోదా కన్నా ఎక్కువ నిధులు ఇస్తుందన్న నమ్మకముందన్నారు.