టీ వద్దు, షెడ్లుతో: కావూరి, బాబు భేటీకి కాంగ్రెస్ ఎంపీలు
హైదరాబాద్/విజయవాడ: రాష్ట్ర విభజన జరిగిపోయినందున హైదరాబాదు నుంచి పరిపాలించడం సరైనది కాదని, పక్కా భవనాలు లేకపోతే.. తాత్కాలికంగా షెడ్లు వేసుకొని అయినా సీమాంధ్ర నుండే పరిపాలన కొనసాగించాలని కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివ రావు ఆదివారం అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడన్న విషయాన్ని వెంటనే తేల్చేయాలని ఆయన కోరారు.
బాబుతో భేటీకి టీఎస్సార్
నూతన ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం ఈ బడ్జెట్ లో 5 వేల కోట్ల రూపాయలు ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు టి సుబ్బరామి రెడ్డి ఆదివారం సూచించారు.
ఆంధ్రప్రదేశ్ పార్లమెంటు సభ్యులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన సమావేశానికి టీఎస్సార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక ప్రతిపత్తి సాధించేందుకు తాము పూర్తి సహకారం అందిస్తామన్నారు. 35 అంశాలతో కూడిన జాబితాను కేంద్రానికి పంపాలని సమావేశంలో నిర్ణయించినట్టు తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా వచ్చి తీరుతుందన్నారు.
కాగా, చంద్రబాబుతో భేటీకి టీడీపీ ఏపీ ఎంపీలతో పాటు తెలంగాణ టీడీపీ ఎంపీలు వచ్చారు. అలాగే కాంగ్రెసు ఎంపీలు సుబ్బిరామిరెడ్డి, జేడీ శీలంలు వచ్చారు. బీజేపీ ఎంపీలు హరిబాబు, గోకరాజు రంగరాజులు వచ్చారు.
భేటీ అనంతరం జేడీ శీలం, బీజేపీ, టీడీపీ నేతల మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. ఏపీకి కాంగ్రెసు పార్టీ ఎంతో చేసిందని జేడీ శీలం అనగా... బీజేపీ ఎంపీలు హరిబాబు, గోకరాజులు అడ్డు తగిలారు. అదే సమయంలో టీడీపీ ఎంపీ సుజనా చౌదరి మాట్లాడుతూ... కాంగ్రెసు వల్లే ఏపీకీ అన్యాయం జరిగిందని ఆరోపించారు.