సీమకిచ్చాకే ఆంధ్రాకివ్వాలి: కావూరి హెచ్చరిక, జగన్ సీఎం కావడం అసంభవం: డొక్కా
కర్నూలు: శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా వచ్చే నీటిని తొలుత రాయలసీమ ప్రజలకు ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ నేత, మాజీ కేంద్రమంత్రి కావూరి సాంబశివ రావు సోమవారం అన్నారు. కర్నూలులో ఆయన మాట్లాడారు.
రాయలసీమ ప్రజల నీటి అవసరాలు తీరిన తర్వాతే శ్రీశైలం నీటిని ఆంధ్రా ప్రాంతానికి కేటాయించాలన్నారు.
లేని పక్షంలో రాయలసీమలో మరో ఉద్యమం వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రభుత్వం దీనిని గుర్తించి చర్యలు చేపట్టాలని సూచించారు. రాయలసీమ వాసుల నీటి అవసరాలు తీర్చేందుకు పట్టిసీమను రికార్డు స్థాయిలో పూర్తి చేసిన విషయం తెలిసిందే.
జగన్ ముఖ్యమంత్రి కావడం అసంభవం: డొక్కా
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం అసంభవమని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఎద్దేవా చేశారు. ఆయన అర్థం పర్థం లేని దీక్షలు చేస్తున్నారని విమర్శించారు.
జగన్ ఎన్ని కలలు కన్నా ముఖ్యమంత్రి కాలేరన్నారు. రాష్ట్రం ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో ఉందన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరు ప్రభుత్వానికి సహకరించాలన్నారు.
అందుకే నా పైన దాడి: రఘువీరా
తన పైన దాడి జరిగిన విషయమై ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి సోమవారం స్పందించారు. తాము విమానాశ్రయ ఏర్పాటుకు వ్యతిరేకం కాదన్నారు. అయితే, వంద ఎకరాలు అవసరమైతే వేల ఎకరాలు ఎందుకు సేకరిస్తున్నారని ప్రశ్నించారు. అక్రమాలు జరిగినందునే తన పర్యటనను అడ్డుకున్నారన్నారు.
హౌసింగ్ శాఖపై సీఎం ఎల్లుండి సమీక్ష
హౌసింగ్ శాఖ పైన సీఎం చంద్రబాబు ఎల్లుండి బెజవాడలో సమీక్ష నిర్వహిస్తారని మంత్రి మృణాళిని చెప్పారు. ఎన్టీఆర్ హౌసింగ్ పథకంపై ఈ సమావేశంలో చర్చిస్తారన్నారు. హాంకాంగ్, సింగపూర్, చైనా గృహ నిర్మాణాలను తాము అధ్యయనం చేశామని ఆమె చెప్పారు.