కెబిఆర్ కాల్పుల కేసు: కర్నూలుకు ఓబులేష్ తరలింపు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని బంజారాహిల్స్ కెబిఆర్ పార్కు కాల్పుల కేసులో నిందితుడు ఓబులేష్ను పోలీసులు కర్నూలు జిల్లాకు తరలించారు. అతను చెప్పిన విషయాల్లోని నిజానిజాలను తేల్చుకోవడానికి పోలీసులు అతన్ని కర్నూలు జిల్లాకు వెంటబెట్టుకుని వెళ్లారు. కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లులో తాను కాల్పులకు ఉపయోగించిన ఎకె 47 రైఫిల్ను దాచినట్లు ఓబులేష్ పోలీసులకు చెప్పిన విషయం తెలిసిందే.
నిత్యానంద రెడ్డిపై కాల్పులు జరిపి పారిపోయిన ఓబులేష్ కర్నూలు వెళ్లి తల దాచుకున్నాడు. కర్నూలులోనే పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. పారిపోయిన తర్వాత అతను రెండు లాడ్జీల్లో ఉన్నట్లు పోలీసులకు తెలిసింది. ఆ రెండు లాడ్జీలకు కూడా ఓబులేష్ను వెంటబెట్టుకుని వెళ్లి అక్కడ సాక్షుల వాంగ్మూలాలను పోలీసులు సేకరించనున్నట్లు సమాచారం.
నిత్యానంద రెడ్డిపై కాల్పులు జరిపి పారిపోయిన తర్వాత ఓబులేష్ ఎక్కడెక్కడ తిరిగాడనే వివరాలను కూడా పోలీసులు సేకరించనున్నారు. ఈ నెల 19వ తేదీన ఓబులేష్ అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ నిత్యానంద రెడ్డిపై కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. హైదరాబాదు సమీపంలోని నార్సింగిలో ఓబులేష్ అద్దెకు ఉంటున్న ఇంటిలో పోలీసులు సోమవారం సోదాలు నిర్వహించారు.
ఓబులేష్ నివాసం ఉన్న ఇంటి నుంచి పోలీసులు ఖాళీ తూటాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ తూటాలు గ్రేహౌండ్స్ నుంచి చోరీ చేసిన ఎకె 47 రైఫిల్కు చెందినవా, మరో ఆయుధానివా అనే విషయాన్ని పోలీసులు ఇంకా తేల్చుకోవాల్సి ఉంది. విచారణ నిమిత్తం ఓబులేష్ను పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్న విషయం తెలిసిందే.