ఏపీకి లాభం: 'ఫాస్ట్'పై కేసీఆర్ అనూహ్య యూ టర్న్ వెనుక...!
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హఠాత్తుగా 'ఫాస్ట్' పథకాన్ని రద్దు చేసింది. రెండు రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మాట్లాడుతూ.. ఫాస్ట్ పథకాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. వ్యూహాత్మకంగానే కేసీఆర్ ఫాస్ట్ పథకం రద్దును ప్రకటించి ఉంటారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
తెలంగాణ విద్యార్థులకు స్కాలర్ షిప్స్ ఇచ్చేందుకు ప్రభుత్వం ఫాస్ట్ పథకాన్ని తీసుకు వచ్చింది. దీనిని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇలాంటి ఫాస్ట్ పథకాన్ని హఠాత్తుగా రద్దు చేయడానికి కారణం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలే కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి.
రానున్న కొద్ది నెలల్లో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరుగుతాయి. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజీనామాను ఆమోదిస్తే సనత్ నగర్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరుగుతుంది. ఈ నేపథ్యంలో హైదరాబాదులోని ఏపీ ఓటర్లను బుజ్జగించే ధోరణిలోనే ఫాస్ట్ పథకాన్ని రద్దు చేశారని అంటున్నారు.
ఫాస్ట్ పథకం విషయమై పలువురు కోర్టుకెక్కారు. ఈ విషయమై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు కూడా వేసింది. ఈ నేపథ్యంలో అధికారుల పైన కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా కూడా తెలుస్తోంది. ఫాస్ట్ పథకం విషయంలో కోర్టు ముందు సరైన వాదనలు వినిపించక పోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం. ఫాస్ట్ పైన వెనక్కి పోయే పరిస్థితి లేదని కేసీఆర్ ఇటీవల మంత్రుల సమావేశంలో, అధికారులతో చెప్పారు.
అయితే, హఠాత్తుగా ప్రభుత్వం యూ టర్న్ తీసుకుంది. ఫాస్ట్ రద్దు పథకాన్ని కేసీఆర్ ప్రకటించే వరకు.. మంత్రులకు కూడా ఈ విషయం తెలియదని సమాచారం. అయితే, గ్రేటర్ ఎన్నికల కోసమే కేసీఆర్ వ్యూహాత్మకంగా.. ఎలాగైనా ముందుకెళ్దామన్న ఫాస్ట్ పథకం పైన అనూహ్యంగా యూ టర్న్ తీసుకున్నారని అంటున్నారు. కాగా, ఫాస్ట్ పథకం వల్ల తెలంగాణలో ఉండే ఏపీ విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది.