కెసిఆర్తో కాలనీలో తలసాని, తెరాసలోకి ఎమ్మెల్యేలు
హైదరాబాద్: ఇళ్లు కూలిపోయిన సనత్నగర్లోని బోయిగుడా ఐడిహెచ్ కాలనీని తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు సోమవారం సాయంత్రం సందర్శించారు. బాధితులను ఆయన పరామర్శించారు. కెసిఆర్ వెంట తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు తలసాని శ్రీనివాస యాదవ్ కూడా ఉన్నారు.
దళితవాడల నుంచి దరిద్రాన్ని తరిమేయాలని కెసిఆర్ ఈ సందర్భంగా అన్నారు. ఐడిహెచ్ కాలనీని ఆదర్శవంతంగా పునర్నిర్మిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఎవరైనా లంచం అడిగితే నేరుగా తన వద్దకు రావాలని ఆయన కాలనీవాసులకు సూచించారు. ఊహించని రీతిలో హైదరాబాద్ అభివృద్ధి చెందుతుందని ఆయన చెప్పారు. ఐదు నెలల్లో కాలనీ నిర్మాణం పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.
ఇదిలావుంటే, శాసనసభ్యులు మదన్లాల్, కనకయ్య, ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, రాజేశ్వర రావు, వెంకట్రావు సోమవారం సాయంత్రం కెసిఆర్ సమక్షంలో తెరాసలో చేరారు. గులాబీ కండువా కప్పి పార్టీ సెక్రటరీ జనరల్ కె. కేశవరావు వారిని పార్టీలోకి ఆహ్వానించారు. పలువురు కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా వారితో పాటు తెరాసలో చేరారు.
కెసిఆర్తోనే బంగారు తెలంగాణ సాధ్యమని ఈ సందర్భంగా కేశవరావు అన్నారు. సిఎం కెసిఆర్ నాయకత్వాన్ని బలపరిచేవారందరినీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని హోం మంత్రి నాయని నర్సింహా రెడ్డి చెప్పారు. ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఖాళీ అవుతుందని ఆయన అన్నారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రి హరీష్ రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.