తెలంగాణ బిడ్డ: చక్రి మృతి పట్ల కేసీఆర్, చంద్రబాబు దిగ్భ్రాంతి
హైదరాబాద్: ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తదితరులు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. తెలంగాణ బిడ్డ మరణం తీరని లోటు అని కేసీఆర్ అన్నారు. చక్రి చిన్న వయస్సులోనే ఎన్నో విజయాలు సాధించారన్నారు.
ఎన్నో విజయాలు సాధించిన తెలంగాణ బిడ్డ మృతి సినీ పరిశ్రమకు తీరని లోటు అన్నారు. చక్రి హఠాన్మరణం పట్ల చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్, టీడీపీ ఎమ్మెల్యే, హీరో నందమూరి బాలకృష్ణ తదితరులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
తెలంగాణలో మారుమూల ప్రాంతంలో జన్మించి, స్వయంకృషితో తెలుగు సినీ పరిశ్రమలో అగ్రశ్రేణి సంగీత దర్శకుడిగా చక్రీ ఎదిగారని, అలాంటి వ్యక్తి మృతిని జీర్ణించుకోలేకపోతున్నామని పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు అంటున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య తదితరులు సంతాపం తెలిపారు.
ఎంతో మంచి వ్యక్తి, తన మిత్రుడు చక్రి మరణవార్తను నమ్మలేకపోతున్నానని ప్రముఖ దర్శకుడు శంకర్ అన్నారు. తన జీవితంలో ఇంత షాక్కు ఎప్పుడు గురి కాలేదన్నారు. స్నేహానికి ప్రాణం ఇచ్చే వ్యక్తి అని, స్నేహితులను ఎంతో ప్రేమించేవాడన్నారు.
ఓ మారుమూల ప్రాంతం నుండి వచ్చి, స్వయంకృషితో ఎదిగారన్నారు. సంగీతాన్ని సినిమాలకు అందిస్తూనే, సేవా కార్యక్రమాలలో పాల్గొనే వారన్నారు. తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు అన్నారు. కాగా, చక్రీ స్వగ్రామం వరంగల్ జిల్లా మహబూబాబాద్ మండలం కంబాలపల్లి. ఆయన సోమవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు.