పరిటాల శ్రీరామ్ పెళ్లికి భారీ బందోబస్తు: చంద్రబాబు-కెసిఆర్ కలవరా?
మంత్రి పరిటాల శ్రీరామ్ తనయుడు వివాహం ఆదివారం పదకొండున్నర గంటలకు జరగనుంది. ఈ పెళ్లికి ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కెసిఆర్ హాజరు కానున్నారు.
అనంతపురం: మంత్రి పరిటాల శ్రీరామ్ తనయుడు వివాహం ఆదివారం పదకొండున్నర గంటలకు జరగనుంది. ఈ పెళ్లికి ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కెసిఆర్ హాజరు కానున్నారు.
అయితే, ఇరువురు నేతలు తమ తమ బిజీ షెడ్యూల్, హాజరు సమయాన్ని చూస్తే ఎదురుపడే అవకాశాలు కనిపించడం లేదు. తొలుత చంద్రబాబు ఆ తర్వాత సీఎం కెసిఆర్ వధూవరులను ఆశీర్వదించనున్నారు.
పన్నెండు గంటలలోపు చంద్రబాబు
చంద్రబాబు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరుతారు. 11 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకుంటారు. 11.00-11.30 మధ్య అధికారులతో జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. 11.30 గంటలకు హెలీకాప్టర్లో బయలుదేరి వెంకటాపురంలో వివాహానికి హాజరవుతారు. మధ్యాహ్నం 12.30కి హెలీకాప్టర్లో బయలుదేరి 12.50 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకుంటారు. ఒంటిగంటకు ప్రత్యేక విమానంలో బయలుదేరి 1.40 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు.
పన్నెండు గంటల తర్వాత కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పుట్టపర్తి నుంచి హెలికాప్టర్లో వెంకటాపురం వెళతారని, మధ్యాహ్నం 12 గంటల తరువాత నూతన దంపతులను ఆశీర్వదించి వెనుదిరుగుతారని తెలుస్తోంది. కాబట్టి ఇరువురు కలిసే అవకాశాలు లేవని తెలుస్తోంది.
పెళ్లికి ప్రముఖులు
వివాహానికి పలువురు ప్రముఖులు హాజరవుతున్నారు. మంత్రులు పత్తిపాటి పుల్లారావు, అయ్యన్న పాత్రుడు, అచ్చెన్నాయుడు, రాష్ట్ర ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు కుటుంబరావు, ప్రభుత్వ విప్ కోన రవికుమార్, రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్మన్ నన్నపునేని రాజకుమారి తదితరులు హాజరవనున్నారు.
1700 మంది పోలీసులతో భారీ బందోబస్తు
మొత్తం 5 రోజుల పాటు నిర్వహిస్తున్న వేడుకలు ఈ నెల 27 నుంచే ప్రారంభమయ్యాయి. పెళ్లికి సంబంధించి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాయలసీమ వంటకాలను రుచి చూపించనున్నారు. భోజనశాలలో ఒకేసారి 50 వేల మంది భోజనం చేసేలా ఏర్పాట్లు చేశారు. 1700 మంది పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.