ఇంటర్నేషనల్ రాజధాని: బాబు ప్లాన్, కేసీఆర్ దూకుడు
హైదరాబాద్: విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని, అభివృద్ధి పైన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రణాళికా బద్దంగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ అభివృద్ధి విషయంలో టీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రతి అంశంలోను బాబుతో పోటీ పడే విధంగా ముందుకు పోతున్నారు.
తమ తమ రాష్ట్రాలకు పరిశ్రమలు, పెట్టుబడుల విషయంలో ఇరువురు ముఖ్యమంత్రులు కూడా దూకుడుగా వెళ్తున్నారు. అవసరమైతే ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ రాయితీలు ఇచ్చి పరిశ్రమలను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. హీరో మోటార్ కార్ప్ విషయంలో ఏపీ, టీ రాష్ట్రాలు పోటీ పడ్డాయి. హీరో ప్రతినిధులు ఇటీవల తెలంగాణలోని నల్గొండ, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో స్థలాలను పరిశీలించారు. మైక్రోసాఫ్ట్ సత్య నాదేళ్లను చంద్రబాబు ఆహ్వానించినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయిందని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సాధ్యమైనన్ని నిధులు కేంద్రం నుండి తెచ్చుకోవడంతో పాటు, పరిశ్రమలను ఆకట్టుకోవడం ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు, అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. కేసిఆర్ కూడా అదే దూకుడుగా వెళ్తున్నారు.
సింగపూర్ లాంటి రాజధానిని ఏర్పాటు చేయాలని చంద్రబాబు భావిస్తుండగా.. హైదరాబాదును అంతర్జాతీయస్థాయికి తీర్చి దిద్దాలని కేసిఆర్ భావిస్తున్నారు. పోలీసింగ్ వ్యవస్థలోను కేసీఆర్ మార్పు కోరుకుంటున్నారు. పారిశ్రామిక దిగ్గజాల సాయంతో తెలంగాణను అభివృద్ధి చేయాలని కేసీఆర్ కూడా భావిస్తున్నారట.
ఇందుకోసం రతన్ టాటా, ముకేష్ అంబానీ, అనిల్ అంబానీ, అజీం ప్రేమ్జీ, ఎన్ఆర్ నారాయణమూర్తి సహకారంతో పారిశ్రామిక విధానాన్ని రూపొందించాలనే తలంపుతో ఆయన ఉన్నారట. తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధిని వేగవంతం చేయడానికి, పారిశ్రామిక విధానాన్ని రూపొందించడానికి ఆ కార్పోరేట్ దిగ్గజాలను సంప్రదించాలని కెసిఆర్ పరిశ్రమల శాఖ అధికారులను ఆదేశించారు. సిసిఐ, ఫిక్కీ వంటి సంస్థల సలహాలు కూడా తీసుకోవాలని సూచించారు.