గవర్నర్ వద్ద సిఎంల భేటీ: తెగిన కృష్ణా జలాల పంచాయతీ
హైదరాబాద్:నాగార్జునసాగర్ వద్ద కృష్ణా జలాల వివాదంపై చెలరేగిన పంచాయతీ తెగినట్లే. రాజభవన్లో జరిగిన ఇరు రాష్ట్రాీల ముఖ్యమంత్రులు కె. చంద్రశేఖర రావు, నారా చందర్బాబు నాయుడి మధ్య జరిగిన చర్చలు కొలిక్కి రాలేదు. ముందుగా ఇరువురు ముఖ్యమంత్రులతో గవర్నర్ నరసింహన్ విడివిడిగా చర్చలు జరిపారు. నిర్దిష్టమైన ప్రతిపాదనలతో ముందుకు రావాలని వారికి గవర్నర్ సూచించినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ అడిగినన్ని నీళ్లు ఇవ్వలేమని కెసిఆర్ చెప్పినట్లు సమాచారం. నాగార్జున సాగర్ వద్ద కేంద్ర బలగాలను మోహరించాలని చంద్రబాబు కోరినట్లు తెలుస్తోంది. సమస్య పరిష్కారమైనట్లు ఇరు రాష్ట్రాల నీటి పారుదల శాఖల మంత్రులు దేవినేని ఉమా మహేశ్వర రావు, హరీష్ రావు భేటీ అనంతరం మీడియాతో చెప్పారు.
గవర్నర్ ముఖ్యమంత్రుల నుంచి వాస్తవ పరిస్థితులు తెలుసుకున్నారు. ఇరు రాష్ట్రాల వాట ఎంత, ఎంత అవసరం, ఎంత వాడుకోవాలనే విషయంపై నిర్దిష్టమైన ప్రతిపాదనలతో ముందుకు రావాలని గవర్నర్ వారికి సూచించినట్లు తెలిసింది. దీనికి ఇరు ప్రాంతాల ముఖ్యమంత్రులు అంగీకరించినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. రాజభవన్ నుంచి చంద్రబాబు నేరుగా శ్రీకాకుళం పర్యటనకు బయలుదేరి వెళ్లారు. కేంద్ర బలగాల మోహరింపునకు కెసిఆర్ అంగీకరించినట్లు చెబుతున్నారు. తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు, ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ఇరు రాష్ట్రాల అధికారులతో కలిసి సమస్య పరిష్కారానికి కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
నాగార్జున సాగర్ వద్ద కృష్ణా నది జలాలపై చోటు చేసుకున్న వివాదంపై చర్చించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజభవన్లో సమావేశమయ్యారు. శనివారం ఉదయం పది గంటలకు వారు సమావేశం కావాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. గవర్నర్ నరసింహన్ సమక్షంలో వారిద్దరు సమస్యపై చర్చించుకుని సామరస్యపూర్వకమైన పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నారు.
కెసిఆర్తో పాటు చంద్రబాబు శనివారం ఉదయం రాజభవన్కు చేరుకున్నారు. వారితో పాటు ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు, తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి టి. హరీష్ రావు, ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
నాగార్జున సాగర్ వద్ద కుడిగట్టు కాలువకు నీటి విడుదలను తెలంగాణ ప్రభుత్వం నిలిపేయడంతో ఘర్షణ వాతావరం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. అక్కడ ఇరు రాష్ట్రాల నీటి పారుదుల, ఇతర శాఖల అధికారులతో పాటు పోలీసులు కూడా మోహరించారు.
ఇరు రాష్ట్రాల నీటి పారుదల శాఖ మంత్రుల దేవినేని ఉమామహేశ్వర రావు, హరీష్ రావు పరస్పరం తీవ్ర విమర్శలు చేసుకున్నారు. తెలంగాణ వాడుకోవాల్సిన దానికన్నా ఎక్కువ నీటిని వాడుకుందని ఉమా మహేశ్వర రావు చెప్పగా, ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే 43 టిఎంసిల పైచిలుకు అదనంగా నీటిని వాడుకుందని హరీష్ రావు అన్నారు. నాగార్జున సాగర్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడుకుని రాజభవన్ వేదికగా చర్చలకు సిద్ధపడ్డారు.
నాగార్జునసాగర్ ఘటనపై గవర్నర్ నరసింహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రత కల్పించాల్సిన పోలీసులే కొట్టుకోవడం సరి కాదని ఆయన అన్నారు. ఇరు రాష్ట్రాల డిజిపిలను ఆయన మందలించారు. ఇరు రాష్ట్రాల పోలీసులు ఘర్షణకు దిగితే ఎందుకు నివారించలేదని ఆయన అడిగారు. డ్యామ్కు పూర్తి రక్షణ కల్పించాల్సిందని ఆయన అన్నారు. పోలీసులు సంయమనం పాటించాల్సిందని ఆయన అన్నారు. నాగార్జునసాగర్ ఆనకట్ట మీదికి అధికారులకను కూడా అనుమతించడం లేదు.