మెట్రోపై బీజేపీ ఆందోళన, అక్బర్ను పిలవలేదని, శుభవార్త చెప్పిన కేసీఆర్
హైదరాబాద్: మెట్రో అలైన్మెంట్ మార్పుల పైన భారతీయ జనతా పార్టీ గురువారం శాసన సభలో ఆందోళన వ్యక్తం చేసింది. దీని పైన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు స్పందించారు. మెట్రో మార్పుల్లో ప్రభుత్వం మూడు మార్పులు సూచించిందని తెలిపారు. చారిత్రక ప్రాంతాల మీదుగా ప్రస్తుత మెట్రో మార్గం రూపకల్పన జరిగిందన్నారు.
అందుకే అలైన్మెంటులో మార్పులు సూచించామన్నారు. అలైన్మెంట్ మార్పులు ఇంకా పెండింగులోనే ఉన్నాయని తెలిపారు. ప్రత్యామ్నాయ మార్గాల పైన అందరం కలిసి చర్చించి నిర్ణయం తీసుకుందామన్నారు. దీని పైన త్వరలో అఖిల పక్షం ఏర్పాటు చేసుకుందామని తెలిపారు.
మెట్రో మార్పుల పైన అలైన్మెంట్ మార్పులు సూచించామన్నారు. దీని పైన హైదరాబాదు నగరానికి చెందిన ఎమ్మెల్యేల అందరి అభిప్రాయాలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పుడే ఓ శుభవార్త వచ్చిందని, మెట్రో మార్పుల కోసం హైకోర్టులో ఉన్న అడ్డంకులు తొలగిపోయాయని చెప్పారు.
గన్ పార్కుకు ఎంతో సెంటిమెంట్ ఉందన్నారు. అందుకే అలాంటి ప్రదేశాలలో మెట్రోను మార్పులు చేశామన్నారు. అసెంబ్లీ వెనుక నుండి మెట్రోను తీసుకు వెళ్లాలని సూచించినట్లు చెప్పారు. మార్పుల పైన అందరు ఎమ్మెల్యేలతోను మాట్లాడుతామని, ప్రత్యామ్నాయాల పైన చర్చించుదామని చెప్పారు.
మెట్రో మార్పుల పైన మజ్లిస్ శాసన సభా పక్ష నేత అక్బురుద్దీన్ ఓవైసీని పిలిచి మాట్లాడారని, అందరిని ఎందుకు పిలవలేదని బీజేపీ ప్రశ్నించింది. దీని పైన కేసీఆర్ మాట్లాడుతూ.. తాను అక్బరుద్దీన్ను పిలవలేదని, అధికారులతో మాట్లాడుతుంటే ఆయన అక్కడకు వచ్చారని చెప్పారు. తాను అక్బరుద్దీన్ ఒక్కడిని పిలిచి మెట్రో పైన చర్చించలేదన్నారు.
ఐఎంజీ భూములపై చర్చ జరగాలి
శాసన సభలో అంతకుముందు హరీష్ రావు మాట్లాడుతూ.. ఐఎంజీ భూముల పైన చర్చ జరగాల్సిందే అన్నారు. ఐఎంజీ భూముల వ్యవహారంపై చర్చ జరగకూడదని టీడీపీ కుట్ర చేస్తోందన్నారు. ఈ భూముల పైన చర్చ జరిగితే చంద్రబాబు బండారం బయటపడుతుందని టీడీపీ సభ్యలు ఆందోళన చెందుతున్నారన్నారు.
సభను అడ్డుకోవడం సరికాదన్నారు. ఐఎంజీ భూములతో పాటు జూబ్లీహిల్స్, ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీ భూముల పైన చర్చ జరగాల్సి ఉందన్నారు. సభలో చంద్రబాబు పైన విమర్శలు సరికాదని టీడీపీ ఎమ్మెల్యే వివేకానంద అన్నారు.
సభలో ప్రశ్నోత్తరాల సమయం జరగకుండా ప్రతిపక్షాలు కావాలనే సభను అడ్డుకుంటున్నాయని తెరాస ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ మీడియా పాయింట్ వద్ద అన్నారు. తాము చేసిన అక్రమాల గుట్టు బయటపడుతుందన్న నెపంతో టీడీపీ, బీజేపీలు సభా సమయాన్ని వృథా చేస్తున్నాయన్నారు.
హైకోర్టులో తొలగిన అడ్డంకులు
మెట్రో పైన హైకోర్టులో అడ్డంకులు తొలగిపోయాయి. గ్రీన్ లాండ్స్ - శిల్పారామం మెట్రో పనులకు హైకోర్టు గురువారం పచ్చజెండా ఊపింది. గతంలో విధించిన స్టేను హైకోర్టు ఎత్తివేసింది. ఇది తెలియడంతో కేసీఆర్ సభలో శుభవార్త అంటూ చెప్పారు.