ఓబులేష్: కేబీఆర్ ఇష్యూపై కేసీఆర్, కార్లో తిప్పుతూ...!
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు శుక్రవారం శాసన శాభలో కేబీఆర్ పార్క్ కాల్పుల ఘటన పైన ప్రకటన చేశారు. నిందితుడి పేరును ఓబులేష్గా చెప్పారు. కేసీఆర్ మాట్లాడుతూ.. కాల్పుల ఘటన పైన తాను అదే రోజు ప్రకటన చేసినట్లు చెప్పారు.
అగంతకుడు అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ నిత్యానంద రెడ్డి పైన ఏకే 47 తుపాకీతో కాల్పులు జరిపాడని, డబ్బులు డిమాండ్ చేసినప్పుడు జరిగిన పెనుగాలాటలో రైఫిల్ ఫైరింగ్ జరిగిందన్నారు. బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో కేసు నమోదయిందన్నారు. సంఘటన జరిగిన గంటల్లో నిందితుడిని గుర్తించారని, పట్టుకునేందుకు చర్యలు తీసుకున్నారన్నారు.
కర్నూలులో అతడిని అరెస్టు చేసినట్లు చెప్పారు. నిందితుడిని ఓబులేష్గా గుర్తించారని, అతను కడప జిల్లా పోరుమామిళ్ల గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారన్నారు. అతను కర్నూలులో పని చేశారని, తర్వాత గ్రేహౌండ్స్కు మారారన్నారు. చోరీ చేసిన ఏకే 47తో కాల్పులు జరిపాడని, సీసీటీవీ ఫుటేజీ ద్వారా కీలక సమాచారం లభించిందన్నారు.
హైదరాబాదులో కట్టుదిట్టమైన శాంతిభద్రతలకు కట్టుబడి ఉన్నామన్నారు. నగరమంతా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అందుకు రూ.150 కోట్లతో అంతర్జాతీయ పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. సీసీ కెమెరాలతోనే ఎన్నో కేసులు చేధించారని, దానికి ప్రజలు కూడా సహకరించాలన్నారు. నిందితుడికి శిక్ష పడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. కార్మికులు, ఉద్యోగులు, పారిశ్రామికవేత్తలు, ప్రజలకు భద్రత కల్పిస్తామన్నారు.
ఓబులేష్ విచారణలో కీలక విషయాలు వెల్లడి
ఓబులేష్ను పోలీసులు విచారించినప్పుడు కీలక విషయాలు వెల్లడైనట్లుగా తెలుస్తోంది. ఆయన గతంలో ఓ సెలబ్రటీని బెదిరించి డబ్బులు వసూలు చేసినట్లుగా తెలుస్తోంది. కేబీఆర్ పార్క్ కాల్పుల అనంతరం బెంగళూరు పారిపోయేందుకు ప్రయత్నించాడు. అతను అంతకుముందు తుపాకీని కర్నూలు జిల్లా ఓర్వకల్లులో దాచాడు.
గ్రేహౌండ్స్ అధికారులు ఆయుధాలు రికవరీ చేసిన సమయంలో అతడు తన జాకెట్ కోటులో ఏకే 47 ఆయుధాన్ని పెట్టుకున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓ సెలబ్రటీని బెదిరించి డబ్బులు వసూలు చేశారని తెలుస్తోంది. ఆ తర్వాత ఈ ఆయుధాన్ని కేబీఆర్ పార్క్ వద్ద రెండోసారి ఉపయోగించాడు. కాగా, ఓబులేష్ను సుమోలో తిప్పుతూ విచారణ జరుపుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ ఘటనలో మరో నిందితుడు రామ్ చరణ్ను కూడా అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది.