ఫైవ్ స్టార్ మినిష్టర్: గీతారెడ్డిపై కెసిఆర్, ఏకేసిన పొన్నాల
మెదక్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖర్ రావు మాజీ మంత్రి గీతారెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆమె ఫైవ్ స్టార్ మినిష్టర్ అని.. అందుకే ఆమె సామాన్యలకు అందుబాటులో ఉండరని కెసిఆర్ ఎద్దేవా చేశారు. శనివారం మెదక్ జిల్లా జహీరాబాద్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన, ఈ సందర్భంగా మాట్లాడారు.గీతారెడ్డిపై సిబిఐ కేసులు ఉన్నాయని, ఆమె జైలుకు వెళ్లడం ఖాయమని అన్నారు.
14ఏళ్ల పోరాటంతోనే తెలంగాణ వచ్చిందని కెసిఆర్ చెప్పారు. తెలంగాణ ఎవరి చేతిలో ఉంటే క్షేమంగా ఉంటుందో ప్రజలే ఆలోచించుకోవాలని అన్నారు. ఈ ఎన్నికల్లో ఎవరి తలరాతలు వారే రాసుకునే సమయం వచ్చిందన్నారు. 40ఏళ్లపాటు తెలంగాణను పాలించిన కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ అభివృద్ధిని మాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఏనాడూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదని చెప్పారు.
అప్పుడు కాపలా కుక్క.. ఇప్పుడు సిఎం పదవి: పొన్నాల
ఆదిలాబాద్: తెలంగాణ వచ్చిన తర్వాత తాను కాపలా కుక్కలా ఉంటానన్న కెసిఆర్.. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి కావాలనుకుంటున్నారని తెలంగాణ పిసిసి చీఫ్ పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. ఆదిలాబాద్ జిల్లా అసిఫాబాద్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కెసిఆర్ తెలంగాణ ద్రోహీ అని విమర్శించారు.
సకల జనుల సమ్మె, మిలియన్ మార్చి సమయాల్లో కెసిఆర్ ఫాంహౌజ్కే పరిమితమయ్యారని ఆరోపించారు. ఒకసారి పొత్తని, ఒకసారి విలీనమన్న కెసిఆర్.. ఇప్పుడు థర్డ్ పార్టీకి మద్దతు ఇస్తామని అంటున్నారని పొన్నాల చెప్పారు. తెలంగాణను అడ్డుకున్న పార్టీలకు ఎలా మద్దతిస్తారని కెసిఆర్ను పొన్నాల ప్రశ్నించారు. దొరల పాలన నచ్చకే టిఆర్ఎస్ పార్టీని పలువురు నాయకులు వీడుతున్నారని అన్నారు.
కెసిఆర్ తన 30ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ తెలంగాణ కోసం పోరాటం చేయలేదని పొన్నాల చెప్పారు. మంత్రి పదవి పార్టీ రాకపోవడం వల్లే తెలుగుదేశం పార్టీని వీడి టిఆర్ఎస్ పార్టీని స్థాపించారని పొన్నాల ఆరోపించారు. ఎన్నికల తర్వాత టిఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని చెప్పారు. తాము అధికారంలోకి వస్తే ఆదిలాబాద్ జిల్లాను ఆదర్శ జిల్లాగా మారుస్తామని తెలిపారు.