1 కాదు రెండు: జుడాలకు కేసీఆర్ షాక్, తెరాసలోకి కవిత
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జూనియర్ డాక్టర్లకు (జుడా)లకు షాకిచ్చారు! జుడాలు ఇక నుండి గ్రామీణ ప్రాంతాల్లో రెండేళ్లు పని చేసేలా కొత్త నిబంధన తీసుకు రావాలని, రెండేళ్ల పని చేసేలా హామీ పత్రాలు తీసుకుంటామన్నారు. కాగా, ఇన్నాళ్లు ఒక్క ఏడాది పని చేయాలనే నిబంధన ఉన్న విషయం తెలిసిందే.
ఆందోళన చేసే జూనియర్ డాక్టర్ల పట్ల తాము కఠినంగా ఉంటామని హెచ్చరించారు. జుడాలు తక్షణం విధుల్లో చేరాలని హితవు పలికారు. కోర్సు పూర్తి చేసిన 750 మంది విద్యార్థులు ఇప్పటికే విధుల్లో చేరారని చెప్పారు. ఐఏఎస్ అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు గ్రామాల్లో పని చేస్తుంటే జూనియర్ డాక్టర్లు ఎందుకు వెళ్లరని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పు వచ్చాక కూడా జుడాలు విధుల్లో చేరకుంటే డిబార్ చేసేందుకు కూడా సిద్ధమయ్యారు.
జిల్లాకు వెయ్యికోట్లు
హైదరాబాదులోని పీవీ నరసింహా రావు ఎక్స్ప్రెస్ వే తరహాలో తెలంగాణలో మరో నాలుగు ఫ్లై ఓవర్లు నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందుకు ఉప ముఖ్యమంత్రి డాక్టర్ రాజయ్య నేతృత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సబ్ కమిటీని వేశారు.
15 రోజుల్లో టెండర్లను ఆహ్వానించాలని సూచించారు. ఏడాదిలోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలోని ఒక్కో జిల్లాలో రహదారులు, బ్రిడ్జిల నిర్మాణానికి జిల్లాకు రూ.వెయ్యి కోట్లు మంజురూ చేయనున్నారు. పదివేల కోట్ల రూపాయలతో నాలుగు ఫ్లై ఓవర్లు నిర్మించనున్నారు.
తెరాసలో చేరుతున్నాం: కవిత, రెడ్యా నాయక్
వరంగల్ జిల్లా డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్, చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య, మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే కవిత తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరాలని నిర్ణయించుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ను కలసిన అనంతరం వారు సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు.
కేసీఆర్కు మద్దతుగా తెరాసలో చేరుతున్నామని రెడ్యా నాయక్ చెప్పారు. పేదలకు ఉపయోగపడే విధంగా ఆయన ప్రకటించిన పలు పథకాలు నచ్చే పార్టీలో చేరుతున్నానన్నారు. మంచి ముహూర్తం చూసుకుని కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరతానన్నారు. తనతో పాటు తన మద్దతుదారులు తెరాసలోకి వస్తారన్నారు.
చట్ట ప్రకారం నీటిని పంచాలి: విద్యాసాగర రావు
విభజన చట్టం ప్రకారం ఉన్న నీటిని బోర్డు పంచాలని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర రావు సచివాలయంలో అన్నారు. కృష్ణా యాజమాన్య బోర్డు వారు లోపాయకారీగా ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. కేసీ కెనాల్కు కృష్ణా నీటిని ఇవ్వాలని బచావత్ చెప్పలేదన్నారు.
ఆంధ్రా అదనపు నీరు వాడుకుంటోందన్నారు. ఆంధ్రా కన్నా తెలంగాణలోనే ఎక్కువ నీటి సమస్య ఉందని చెప్పారు. శ్రీశైలంలో 854 అడుగుల కిందకు వెళ్లి తీరుతామన్నారు. విద్యుదుత్పత్తిని ఆపే సమస్యే లేదన్నారు. ఇదే విషయాన్ని బోర్డుకు చెప్పామన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు కట్టిందే విద్యుత్ ఉత్పత్తి కోసమన్నారు.