కేసీఆర్ వ్యాఖ్యలతో కసి పెరిగింది.. ఆరునెలల్లో ఆర్టీసీ విలీనం చేసి తీరుతాం :పేర్ని నాని
తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీ ప్రభుత్వం ఆర్టీసీ విలీనం గురించి చేసిన వ్యాఖ్యల తరువాత ఇంతకాలానికి ఏపీ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని గట్టిగా స్పందించారు. ఏపీఎస్ఆర్టీసీని ఏపీ ప్రభుత్వంలో విలీనం చేసి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు తమ ప్రభుత్వానికి మరింత పట్టుదలను, కసిని పెంచాయని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు.
ప్రభుత్వంపై కొన్ని మీడీయా సంస్థలు విషం చిమ్ముతున్నాయి : పేర్ని నాని
విజయవాడ ఆర్టీసి ఆసుపత్రిలో టీడీపీ ఎంపీ కేశినేని నాని ఎంపీ నిధులతో నిర్మించిన భవనాన్ని ప్రారంభించిన మంత్రి పేర్ని నాని ఆర్టిసి విలీనంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ విషయంలో జరుగుతున్న పరిణామాలను చూస్తున్నామని, తెలంగాణలో ఆర్టీసీ ప్రైవేటు పరం అవుతున్న పరిస్థితులు గమనిస్తున్నా మని పేర్కొన్నారు. అంతేకాదు ఏపీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం ఒక గొప్ప నిర్ణయమని , సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకుంది ఒక మొండి నిర్ణయమని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణలోని ప్రస్తుత ఆర్టీసీ పరిస్థితులను, ఏపీ లోని ఆర్టీసీ పరిస్థితిని పోల్చి పేర్ని నాని వివరించారు. తెలంగాణలో ఆర్టీసీ సమ్మె పై మాట్లాడిన సీఎం కేసీఆర్ ఏపీ లో ఏం జరుగుతుందో ఆరునెలల్లో చూద్దామని చేసిన వ్యాఖ్యలతో కసి పెరిగిందని, బాధ్యత కూడా ఎక్కువైందని చెప్పిన మంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి ఆలోచన మేరకు ఆర్టీసీ కార్మికుల విలీనాన్ని త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు. సీఎం కెసిఆర్ వ్యాఖ్యల పైన తాము పాజిటివ్ గా ఉన్నామని చెప్పిన మంత్రి ఆయన చెప్పినట్లు మూడు నెలల్లోనో , ఆరు నెలల్లోనో ఆర్టీసీ విలీన ప్రక్రియ పూర్తి చేస్తామని పేర్కొన్నారు. అనుకున్న సమయానికి ఆర్టీసీని విలీనం చేయాలనే కసిని, పట్టుదలను సీఎం కేసీఆర్ తన వ్యాఖ్యలతో తమలో పెంచారని రవాణా శాఖ మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు.