'కెవిపి డబ్బుతో కెసిఆర్ ప్రచారం, జగన్ చెబితే టిక్కెట్'
హైదరాబాద్: కెవిపి రామచంద్ర రావు డబ్బుతో కెసిఆర్ ప్రచారం చేస్తున్నారని, జగన్ చెబితేనే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డికి టిక్కెట్ ఇచ్చారని, తెలంగాణ ఉద్యమకారుల రక్తం కళ్లచూసిన కొండా దంపతులకు టిక్కెట్ ఇచ్చి మోసం చేశారని తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు తెలంగాణ రాష్ట్ర సమితి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన టి కాంగ్రెసు నేతలు నిప్పులు చెరిగారు. తెరాస అంటే తెలంగాణ రావుల పార్టీ అని, కెసిఆర్ సీమాంధ్ర పెట్టుబడిదారుల తొత్తు అని ఘాటుగా విమర్శించారు.
అక్రమ ప్రాజెక్టుల ద్వారా కెవిపి సంపాదించి ఇచ్చిన డబ్బుతోనే కెసిఆర్ ఎన్నికల ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణను వ్యతిరేకించిన మూడో కూటమి పార్టీలతోనే కలుస్తానని చెబుతున్న కెసిఆర్ మరోసారి ఈ ప్రాంతానికి అన్యాయం చేయాలనుకుంటున్నారా? అన్నారు. టిపిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, కాంగ్రెస్ ఎంపీలు జి వివేక్, మధుయాష్కీ, గుత్తా సుఖేందర్ రెడ్డి, సిరిసిల్ల రాజయ్య మంగళవారం గాంధీభవన్లో విలేకర్లతో మాట్లాడారు.
నటకాచ ప్రస్తుతం తెలంగాణ రావుల సమితిగా మారిపోయిందని, ఆ కులానికి చెందిన వారికే ఎక్కువ టికెట్లు ఇచ్చారన్నారు. తెలంగాణ ఇచ్చిన దేవత సోనియా గొప్పదో, దక్షిణ తీసుకుని, టికెట్లు అమ్ముకునే పూజారి గొప్పనో తేల్చుకోవాలని మధుయాష్కీ మరోమారు సూచించారు. ఉభయసభల్లో తెలంగాణ బిల్లును అడ్డుకున్న సిపిఎం, తృణమూల్ కాంగ్రెస్, డిఎంకె, జెడి(యూ)వంటి పార్టీల కూటమి థర్డ్ఫ్రంట్ పల్లవిని తాజా గా ఎత్తుకున్నాడని దుయ్యబట్టారు.
కాంగ్రెస్ తెలంగాణలో 10కి పైగా ఎంపీ సీట్లను గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. వివేక్ మాట్లాడుతూ, హరీశ్ రావు, కెటిఆర్ తన వద్దకు వచ్చి.. తెలంగాణ ఇచ్చాక తెరాసను కాంగ్రెస్లో విలీనంచేసే బాధ్యత మీరే తీసుకోండంటూ తనను ప్రేరేపించారని, అందుకే తాను తెరాసలో చేరానన్నారు. తీరా తెలంగాణ ఇచ్చాక మాట మార్చారని విమర్శించారు. అందుకే తాను మళ్లీ కాంగ్రెస్లో చేరుతానంటూ అప్పుడే సోనియాకు లేఖ రాశానని వివరించారు.